చేవెళ్ల కాంగ్రెస్ సభలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి వాడిన భాష జుగుప్సాకరంగా ఉందని మాజీ మంత్రి, బీఆరెస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు
విధాత : చేవెళ్ల కాంగ్రెస్ సభలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి వాడిన భాష జుగుప్సాకరంగా ఉందని మాజీ మంత్రి, బీఆరెస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. కేటీఆర్ను మగాడివైతే ఒక్క సీటును గెలిపించుకో అంటూ రేవంత్రెడ్డి సవాల్ విసిరారని, అయితే రేవంత్ రెడ్డి అంత మగాడివైతే తాను ఎంపీగా ఉన్న మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి ఎందుకు గెలుచుకోలేదని ప్రశ్నించారు. నీవు అంత మగాడివైతే గొప్పవాడివైతే రేపు తెలంగాణలోని 17పార్లమెంటు స్థానాలను గెలిపించుకుని నీ మగతనం నిరూపించుకో అని నీ భాషాలో సవాల్ చేస్తున్నానని కడియం అన్నారు. సీఎం హోదాలో రేవంత్రెడ్డి భాష మర్యాదగా ఉంటుందని భావించామని, అయితే ఆయన భాష మారడం లేదన్నారు. ప్రతిపక్షాలను విమర్శించడమే సీఎం రేవంత్ పనిగా పెట్టుకున్నారన్నారు. సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు.
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాజకీయాల కోసం మేడిగడ్డను వాడుకోవద్దన్నారు. మేడిగడ్డ కుంగిపోవడానికి సాంకేతిక కారణాలు ఉండొచ్చన్నారు. మేడిగడ్డపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోండన్నారు. మేడిగడ్డకు ఖర్చు చేసింది రూ.3వేల కోట్లు మాత్రమే అన్నారు. రాజకీయాల కోసం రైతులను కాంగ్రెస్ ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రగతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యంగా చూపడం బాధకరమన్నారు.