విధాత: బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఉమ్మడి నల్గొండ జిల్లా బిజెపి పార్టీ శ్రేణులు భారీ ఆశలు పెట్టుకున్నాయి. తనదైన దూకుడు రాజకీయాలతో, ఆర్థిక, అనుచర బలంతో జిల్లాలో బిజెపి పార్టీకి రాజగోపాల్ రెడ్డి ఊపు తేస్తారని, జిల్లా నుండి బీజేపీకి అసెంబ్లీ ప్రాతినిధ్య భాగ్యం దక్కిస్తారని భావించినప్పటికీ మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పిదప పార్టీ శ్రేణుల అంచనాలకు భిన్నంగా జిల్లా బిజెపి రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించలేదు. […]
విధాత: బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఉమ్మడి నల్గొండ జిల్లా బిజెపి పార్టీ శ్రేణులు భారీ ఆశలు పెట్టుకున్నాయి. తనదైన దూకుడు రాజకీయాలతో, ఆర్థిక, అనుచర బలంతో జిల్లాలో బిజెపి పార్టీకి రాజగోపాల్ రెడ్డి ఊపు తేస్తారని, జిల్లా నుండి బీజేపీకి అసెంబ్లీ ప్రాతినిధ్య భాగ్యం దక్కిస్తారని భావించినప్పటికీ మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పిదప పార్టీ శ్రేణుల అంచనాలకు భిన్నంగా జిల్లా బిజెపి రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించలేదు.
అయితే బిజెపిలో చేరాక తొలిసారిగా రాజగోపాల్ రెడ్డి జిల్లా కేంద్రానికి సోమవారం దివంగత బిజెపి నేత గుండెగోని మైసయ్య గౌడ్ వర్ధంతి సభకు హాజరయ్యేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తనదైన దూకుడైన ఉపన్యాసంతో బిజెపి శ్రేణులను ఉత్తేజపరుస్తూ జిల్లాలో బిజెపి బలం తక్కువగా అంచనా వేయవద్దని.. అసలైన ఆట ఇప్పుడే మొదలైందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు బిజెపిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని నాయకులు, కార్యకర్తలే గట్టిగా పని చేయాల్సి ఉందని, ఉమ్మడి జిల్లాలో 12 సీట్లను గెలిచేందుకు పార్టీ కేడర్ పోరాడాలన్నారు. నిజానికి ఆయన బిజెపిలో చేరాక ఉమ్మడి నల్గొండ జిల్లాలో రానున్న ఎన్నికల్లో బిజెపి గెలుపు బాధ్యతలను భుజాన వేసుకుంటారని జిల్లా రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతారని పార్టీ శ్రేణులు భావించాయి. కొంత ఆలస్యంగానైనా ఆయన జిల్లా బిజెపి రాజకీయాలలో క్రియాశీలకంగా పని చేసేందుకు ముందుకు రావడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వ్యక్తం అవుతుంది.
దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ పార్టీలకు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుతం 12 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యంతో పూర్తిగా గులాబీ కోటగా మారిపోయింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఇన్నాళ్లుగా పాతుకుపోయిన కాంగ్రెస్ సీనియర్లను, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను, పొత్తుబలంతో పోటీకి ఉవ్విళ్లూరుతున్న కమ్యూనిస్టులను ఓడించి బిజెపిని గెలిపించే అంత గొప్ప గేమ్ ఛేంజర్ గా రాజగోపాల్ రెడ్డి నిలవాలని కమలదళం ఆశిస్తుంది.
రాజగోపాల్ రెడ్డి బలంతో నైనా ఉమ్మడి జిల్లాలో బిజెపి గెలుపు ఖాతా తెరిచి చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కించుకోవాలని ఆశపడుతుంది. కనీసం సగం అసెంబ్లీ స్థానాల్లోనైనా బిజెపి గెలవాలన్న కమలదళం ఆశలు ఫలించాలంటే నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ప్రజాదరణతో పాటు బలమైన అభ్యర్థులు ఉండాల్సిన పరిస్థితి అనివార్యంగా ఉంది.
అయితే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి, భువనగిరిలో జట్టా బాలకృష్ణారెడ్డి, సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వరరావు మినహా మరెక్కడా కనీసం పాతికవేల ఓట్ల సత్తా ఉన్న అభ్యర్థి కనిపించడం లేదు. బూర నర్సయ్య గౌడ్ ఇబ్రహీంపట్నం సీటుపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. గతంలో రెండు పర్యాయాలు నల్గొండ మున్సిపాలిటీ పాలించిన చరిత్ర ఉన్న బిజెపికి నల్లగొండలో సైతం బలమైన అభ్యర్థుల కొరత నెలకొంది. ఇక్కడ బిజెపి నుండి మాధగోని శ్రీనివాస్ గౌడ్, నూకల నరసింహారెడ్డి, నాగం వర్షిత్ రెడ్డిలు టికెట్ రేసులో ఉన్నారు.
ఆలేరులో కాసం వెంకటేశ్వర్లు, దాసరి మల్లేశంలు, దేవరకొండలో లాలూ నాయక్, కళ్యాణ్ నాయక్ లు, తుంగతుర్తిలో కడియం రామచంద్రయ్య, నకిరేకల్ లో నకిరేకకంటి మొగిలయ్య, పోతేపాక సాంబయ్య, షాపూరి రవి , పాల్వాయి రజినిలు, మిర్యాలగూడలో సాదినేని శ్రీనివాసరావు, సాగర్ లో కంకణాల శ్రీధర్ రెడ్డి, కోదాడలో బొబ్బ భాగ్యరెడ్డి, హుజూర్నగర్ లో గట్టు శ్రీకాంత్ రెడ్డిలు పార్టీ పరంగా టికెట్ రేసులో ఉన్నారు.
బిజెపి ఆయా నియోజకవర్గాల్లో గెలవాలంటే వారి కంటే బలమైన అభ్యర్థులు కావాలన్న వాదన వినిపిస్తుంది. ఇందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్ వలస నేతలపై కమలదళం ఆశపెట్టుకుంది. ఇప్పటికే రెండు మూడు నియోజకవర్గాల్లో బీజేపీకి ఉన్న బలమైన అభ్యర్థులను గెలిపించడంతో పాటు అభ్యర్థుల కొరత ఉన్న నియోజకవర్గాల్లో బిజెపి పార్టీకి గెలుపు గుర్రాల కోసం ఇతర పార్టీల నుండి బలమైన నాయకులను పార్టీలోకి తీసుకొచ్చేందుకు రాజగోపాల్ రెడ్డి తన శక్తి యుక్తులను వినియోగించాల్సి ఉంది. ఇందులో రాజగోపాల్ రెడ్డి సఫలం అయితేనే ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం లేకపోలేదు. అయితే ఆయన ఈ దిశగా ఎంత మేరకు సఫలీకృతం అవుతారన్నది మునుముందు తేలాల్సి ఉంది.