Kodali Nani
విధాత: వైరి పార్టీలో ఉన్నా సరే మిత్రుడు మిత్రుడే.. అందుకే అయన మంచికోరుకున్నారు మిగతా ఇద్దరూ. వాస్తవానికి వేర్వేరు పార్టీల్లో ఉన్నా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి, ఇంకా వంగవీటి రాధా .. ఈ ముగ్గురూ బాగా సన్నిహిత మిత్రులు అన్న సంగతి తెలిసిందే.
నాని, వంశి ఇద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉండగా రాధా ఇప్పుడు టిడిపిలో ఉన్నారు. అయితే నేడు వంగవీటి మోహన రంగా 76వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా కాపు సంఘాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ సైతం కాపులను మచ్చిక చేసుకునేందుకు వంగవీటి రంగాను తరచూ తలుచుకుంటోంది.
పవన్ ఎలాగు టిడిపితో పొత్తులో వెళ్లే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో కాపుల ఓట్లు రాబట్టేందుకు, జగన్ సైతం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే గుడివాడ పార్టీ ఆఫీసులో రంగా జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం కడదాకా పోరాడిన గొప్ప నాయకుడు రంగా అని కొనియాడారు. అంతేకాకుండా రంగా కుమారుడు రాధాకు మంచి రాజకీయ భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
వాస్తవానికి రాధా 2019 ఎన్నికల ముందు వరకూ వైసిపిలో ఉండేవారు.. టికెట్ విషయంలో అసంతృప్తికి గురై టిడిపిలో చేరారు. అక్కడ టికెట్ దక్కలేదు.. పైగా టిడిపి సైతం అధికారంలోకి రాలేదు. దీంతో అయన అలా రాజకీయంగా వెనకబడిపోయారు. అయినా సరే తన మిత్రుడు రాజకీయంగా వృద్ధిలోకి రావాలని కొడాలి నాని కోరుకోవడం గమనార్హం.