లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుదాం: కేటీఆర్‌

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో బీఆరెస్ సత్తా చాటుదామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు

లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుదాం: కేటీఆర్‌
  • జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో బీఆరెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌


విధాత : రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్డగోలు హామీలతో స్వల్ప ఓట్ల తేడాతో కొన్ని సీట్లు కోల్పోయి సాంకేతికంగా అధికారం కోల్పోవాల్సివచ్చిందని లోక్ సభ ఎన్నికల్లో బీఆరెస్ సత్తా చాటుదామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ హైద్రాబాద్‌ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పరిధిలో బీఆరెస్‌కు జీహెచ్‌ఎంసీ కార్పోరేటర్లు అపూర్వ విజయం అందించడంలో కీలక పాత్ర వహించడం పట్ల తాను పార్టీ కార్పోరేటర్లకు, పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. హైదరాబాద్ నగరంలో బీఆరెస్‌ పటిష్టంగా ఉందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగిరేసేందుకు అందరము కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.


అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే బీఆరెస్ పనిచేస్తుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులంతా సన్నద్ధం కావాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి నిరాశ పడకుండా ప్రజల తరఫున ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు ఒత్తిడి తీసుకువచ్చేలా బాధ్యతాయుతమైన ప్రతిపక్షపాత్రను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు.


ఇందులో భాగంగా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని అయితే హామీలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామన్నారు. జీహెచ్ఎంసీలో అధికారంలో ఉన్న బీఆరెస్‌ పార్టీ నగర అభివృద్ధి కోసం ఎప్పటిలానే నిరంతరంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఫసియుద్ధిన్ తదితరులు పాల్గొన్నారు.