ఆరు గ్యారెంటీల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త‌: కాంగ్రెస్

అధికారంలోకి రాగానే నిర్వ‌హించే మొద‌టి కేబినెట్ స‌మావేశంలోనే ఆరు గ్యారెంటీల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త తీసుకు వ‌స్తామ‌ని కాంగ్రెస్ తెలిపింది.

  • By: Somu    latest    Nov 29, 2023 11:15 AM IST
ఆరు గ్యారెంటీల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త‌: కాంగ్రెస్
  • అధికారంలోకి రాగానే మొద‌టి కేబినెట్ లోనే..
  • బిర్లా మందిర్‌, నాంప‌ల్లి ద‌ర్గాల‌లో పూజ‌లు. ప్రార్థ‌న‌లు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి


విధాత‌, హైద‌రాబాద్: అధికారంలోకి రాగానే నిర్వ‌హించే మొద‌టి కేబినెట్ స‌మావేశంలోనే ఆరు గ్యారెంటీల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త తీసుకు వ‌స్తామ‌ని కాంగ్రెస్ తెలిపింది. ఈ మేర‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ వ్య‌వ‌హారాల ఇంచార్జీ మానిక్ రావు ఠాక్రే, అంజ‌న్ కుమార్ యాద‌వ్‌, మ‌ధు యాష్కీ, వి. హ‌న్మంత‌రావు, వీ. హ‌న్మంత‌రావు త‌దిత‌రులు బుధ‌వారం మేనిఫెస్టోతో పాటు ఆరు గ్యారెంటీల ప‌త్రాల‌తో బిర్లామందిర్‌, నాంప‌ల్లి ద‌ర్గాల‌లో పూజ‌లు ప్రార్థ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఈఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల మేర‌కు అమ‌లు చేస్తామ‌ని ప్ర‌మాణం చేశారు.


సెప్టెంబర్ 17న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తుక్కుగుడ‌ లో జరిగిన విజయ సంకల్ప బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల మేర‌కు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామ‌ని ప్ర‌మాణం చేశారు.


మహాలక్ష్మి పేరుతో మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు, 500 రూపాయలకే వంట గ్యాస్, ఆర్టీసీ బస్ లలో ఉచిత ప్రయాణం లాంటి హామీలు సోనియాగాంధీ ఇచ్చారు.


రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు 15000 రూపాయలు ఎకరాకు, వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు, వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ.ఇచ్చారు.


గృహ జ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షల రూపాయలు, ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.


యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ చేయూత పథకం కింద నెలకు 4000 పెన్షన్ 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్య భీమా లాంటి పథకాలను అమలు చేస్తామని సోనియా గాంధీ విజయ సంకల్ప సభలో ప్రకటించారు.


ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో ఈ ఆరు గారెంటీలను విస్తృతంగా ప్రచారం చేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఈ ఆరు గ్యారంటీల‌ పై చట్టం చేస్తామని ప్రకటించారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీల మేర‌కు చ‌ట్టం తీసుకు వ‌స్తామ‌ని ప్ర‌మాణం చేశారు.