Minister Ponnam | తుప్రాన్ గురుకులంలో పొన్నం తనిఖీలు
మెదక్ జిల్లా తుప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో మంత్రి పొన్నం ప్రభాకర్.. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు

- విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి
- సమస్యల పరిష్కారానికి వెంటనే ఆదేశాలు
- విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం
Minister Ponnam | విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లా తుప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్.. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్లోఉన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో 640 మంది విద్యార్థులు చదువుతున్నారు.
పాఠశాల ఆవరణ శుభ్రంగా లేకపోవడం, విద్యార్థుల హాస్టల్ వసతి, క్లాస్ రూం ఒకే గదిలో ఉండటంతో అధికారులను పిలిపించి మాట్లాడారు. ఆర్డీవో జయ చందర్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దిన్ తహసీల్దార్ విజయలక్ష్మిని పిలిపించి, స్కూల్ సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్కూల్లో వాటర్ ప్లాంట్ మరమత్తుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా 50 వేల రూపాయలను పాఠశాల సిబ్బందికి అందించారు.
స్కూల్లో కాంపౌండ్ లేకపోవడంతో కుక్కలు వస్తున్నాయని సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థులు కొంత మంది చెట్ల కింద చదువుతుండడంపై ఆరాతీశారు. వెంటనే అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్ కమిషనర్ రమణ బాబు, మెదక్ కలెక్టర్ రాజర్షి షాతో ఫోన్లో మాట్లాడారు.
స్కూల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. స్కూల్లో విద్యార్థులకు బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆర్డీవోకి చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్లో ప్లే గ్రౌండ్లో ఆటో వస్తువులతో పాటు ఓపెన్ జిమ్, పాఠశాల ఆవరణ శానిటేషన్ పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ను ఆదేశించారు. స్కూలుకి కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని తాసిల్దార్ని ఆదేశించారు.
డ్రింకింగ్ వాటర్ సౌకర్యంతో పాటు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంపై మున్సిపల్ కమిషనర్ దృష్టి సాధించాలని మంత్రి ఆదేశించారు. స్కూల్లో ప్రతి తరగతి గది తిరుగుతూ విద్యార్థులతో ముచ్చటించారు. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల సిబ్బంది సైతం విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
అనంతరం విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి.. విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భోజనం చేశారు. మధ్యాహ్న భోజన సిబ్బందితో పాటు వాచ్ మెన్లను సన్మానించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ స్కూల్లో మార్పులు జరగాలని, పాఠశాల భవిష్యత్ రూపు రేఖలు మార్చాలని ఆకస్మికంగా విజిట్ చేశానని తెలిపారు.