పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నువ్వు పెట్టిన కాంగ్రెస్ అభ్యర్ధి నా మీద ఓడిపోతే నీవు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అని మంత్రి పొన్నం ప్రభాకర్కు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు
విధాత : పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నువ్వు పెట్టిన కాంగ్రెస్ అభ్యర్ధి నా మీద ఓడిపోతే నీవు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అని మంత్రి పొన్నం ప్రభాకర్కు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. అయోధ్య రాముడి విషయంలో కాంగ్రెస్ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు. మంగళవారం బండి సంజయ్ ప్రజాహిత యాత్ర హుస్నాబాద్ చేరుకోగా కాంగ్రెస్ కార్యకర్తలు యాత్రపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారరు.
మంత్రి పొన్నం పై బండి సంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన చెపట్టారు. సంజయ్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సంజయ్ ఫ్లెక్సీలను చించివేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కావాలనే కాంగ్రెస్ వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అయోధ్యలో రాముడు జన్మించినట్లు గ్యారెంటీ ఏంటని మీరు ప్రశ్నిస్తే, నేను నా తల్లికి పుట్టినట్టు గ్యారెంటీ ఏంటి అంటే నువ్వెందుకు మీదేసుకుంటున్నావని పొన్నంను ప్రశ్నించారు.
నేను నా విశ్వాసాలతో రాముడు పేరిట ఎన్నికల్లో నిలుచుంటా, నువ్వు నీ వాదనతో నీ అభ్యర్థిని నిలబెట్టాలని, నేను ఓడితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, వ్యాపారం చేసుకుని బతుకుతా, మళ్ళీ రాముడని, హిందూ మతమని మాట్లాడనని సంజయ్ మంత్రి పొన్నంను సవాల్ చేశారు.. ఒకవేళ నీవు పెట్టిన అభ్యర్థి ఓడితే రాజకీయాల నుంచి నువ్వు తప్పుకుంటావా అని పొన్నంను సంజయ్ ప్రశ్నించారు. నన్ను అనవసరంగా గెలుకుతున్నారని, నేను శాంతియుతంగా ప్రజాహిత యాత్ర చేపడితే మీకేం సమస్య అని నిలదీశారు.
ఎక్కడ నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. పొన్నంతో రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని, మొదటి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన వారిలో పొన్నం ఉన్నారని, ఇలాంటి అలజడులలో రేవంత్ను ఇరికించి ఆయన పదవి కిందకి నీళ్ళు తేవచ్చన్నారు. బీఆరెస్లో కేటీఆర్, కాంగ్రెస్లో పొన్నంలు మోపైండ్రని, కేటీఆర్ వాగుడుతో బీఆరెస్ మునిగిందని, పొన్నంతో వాగుడుతో కాంగ్రెస్ మునగడం ఖాయమని బండి సంజయ్ విమర్శించారు.
సంజయ్ది రాజకీయ డ్రామా : మంత్రి పొన్నం
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ఆయనపై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి ఎంపీగా ఏం చేశావో చెప్పి యాత్ర చేయాలని తాను అన్నట్లు తెలిపారు. రాముడి జన్మంపై నేను ఎప్పుడు మాట్లాడ లేదని, నేనని మాటను నాకు ఆపాదిస్తూ తల్లి జన్మపై మాట్లాడటం దుర్మార్గమన్నారు. తల్లి ఎవరికైనా తల్లేనని అలాంటి మాటలు తప్పు అన్నారు.
మేమేవరం ఆయన యాత్రను అడ్డుకోవడం లేదని, బండి మాటలను మీరు సమర్థిస్తున్నారా అని నేను బీజేపీ అధ్యక్షుడిని అడుగుతున్నానన్నారు. కరీంనగర్ అభివృద్ధికి సంబంధించి బహిరంగ చర్చకు నేను సిద్ధమని, ఓటమి భయంతోనే బండి ఇలాంటి మాటలు మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారన్నారు. మేం హింసవాదులం కాదని, శవాలపై పేలాలు ఏరుకునే వాళ్లం కాదని, రాజకీయంగా ఏ యాత్రలైన చేసుకోవచ్చని, కాని నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.
హిందూ గాల్లు బొందుగాల్లు అని కేసీఆర్ అన్న మాటలను ఎలా రాజకీయంగా వాడుకున్నాడో అందరికి తెలుసని, ఇప్పుడు రాముడి పేరుతో సంజయ్ రాజకీయం చేస్తున్నాడన్నారు. ఇప్పుడు అమ్మ గురించి సంజయ్ నువ్వు మాట్లాడిన మాటల్తో ఆయన రాజకీయ జీవితం అంతరించిపోవడం ఖాయమని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.