నిర్మలా సీతారామన్: మొదటి నుంచి వెటకారమే.. మండిపడుతున్న నెటిజన్లు
రూపాయి పతనంపై సమాధానం చెప్పాలని రేవంత్ ప్రశ్న సమస్యను పక్కదోవ పట్టించేలా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాటలు గతంలోనూ ఇలానే మాట్లాడి అబాసుపాలు.. విధాత: రూపాయి పతనంపై గతంలో నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్పై ఉన్నది. అక్కడ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నను చూడాలి తప్పా భాషకు సంబంధించిన అంశాన్ని కేంద్రమంత్రి తెరమీదికి తేవడం అంటే అసలు విషయాన్నిపక్కదోవ పట్టించడమే అని […]

- రూపాయి పతనంపై సమాధానం చెప్పాలని రేవంత్ ప్రశ్న
- సమస్యను పక్కదోవ పట్టించేలా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాటలు
- గతంలోనూ ఇలానే మాట్లాడి అబాసుపాలు..
విధాత: రూపాయి పతనంపై గతంలో నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్పై ఉన్నది. అక్కడ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నను చూడాలి తప్పా భాషకు సంబంధించిన అంశాన్ని కేంద్రమంత్రి తెరమీదికి తేవడం అంటే అసలు విషయాన్నిపక్కదోవ పట్టించడమే అని నెటిజన్లు మండిపడుతున్నారు.
రేవంత్రెడ్డి మాట్లాడిన హిందీ ఉత్తరాది నేతల మాదిరిగా ఉండకపోవచ్చు. ఆయన మాతృభాష ఏమీ హిందీ కాదు. అంతమాత్రాన ఆయన మాట్లాడిన మాటలను అవహేళన చేసే విధంగా కేంద్ర మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది. మాట్లాడితే తాను తెలుగు కోడలినే అనే ఆమె సాటి తెలుగువాడు దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు ఆ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలి. వీలైతే రేవంత్ కు తగిన సలహా ఇవ్వవచ్చు. అంతేగానీ సమస్య రూపాయి పతనం అయితే రేవంత్ మాట్లాడిన భాషతో ముడిపెట్టి సభలో అసలు విషయాన్ని పక్కదోవ పట్టించినట్టు అనిపిస్తున్నది.
పార్లమెంటు ఉన్నది చట్టాలు చేయడానికి, ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి, దానికి అధికారంలో ఉన్న ప్రభుత్వ వివరణ, పరిష్కారాలు కోరడానికి అనే విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రిగారు గుర్తుంచుకుంటే మంచిది. అంతేగాని అందరూ తనలా అనర్గళమైన ఇంగ్లీష్, హిందీ మాట్లాడాలి అన్నట్టు వ్యవహరించడం సరి కాదని సోషల్ మీడియాలో నెటిజన్లు మండి పడుతున్నారు.
గతంలో దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధరలు పెరిగిపోయాయి. సామాన్యులకు అందుబాటులో లేనంతగా ధరలు పెరిగాయి. దీనిపై లోక్సభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలె ఈ అంశాన్ని లేవనెత్తారు. ఉల్లి ధరల పెరుగుదలపై ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కూడా అప్పుడు ఆర్థిక మంత్రి అర్థంలేని సమాధానం చెప్పి విమర్శల పాలయ్యారు. ఉల్లిధరలు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సభకు వివరిస్తూనే.. నేను ఉల్లి, వెల్లుల్లి పెద్దగా తినను. ఉల్లిపాయలను పెద్దగా ఉపయోగించని కుటుంబం నుంచి వచ్చానని చెప్పి అభాసు పాలయ్యారు.
ఆ మధ్య రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను నిజామాబాద్ కలెక్టర్ను ప్రశ్నించి నవ్వుల పాలయ్యారు. మోడీ ఫొటో గురించి కలెక్టర్తో వాగ్వాదానికి దిగారు. అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన విషయాలను కలెక్టర్ దగ్గర ప్రస్తావించి తన అవగాహనలేమిని బయటపెట్టుకున్నారని విమర్శలు ఎదుర్కొన్నారు.
ప్రజా సమస్యల గురించి పార్లమెంటులో ఎవరూ మాట్లాడినా వారిపై తమ వాట్సప్ వర్సిటీలో వ్యంగ్యంగా చిత్రించడం. లేదా మైకులు కట్ చేయడం, లేదా స్పీకర్ ద్వారా నియంత్రించడం గత ఎనిమిదిన్నరేళ్లుగా చేస్తున్నారు. అందుకే భారత్ జోడో యాత్రలో రాహుల్గాంధీ ఒక సభలో మైక్ బంద్ పెట్టి అందరికీ అర్థమయ్యేలా వివరించారు.
ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే ఇలానే మైక్ కట్ చేస్తున్నారని అందుకే మీ దగ్గరికే నేరుగా వచ్చి వాస్తవ పరిస్థితులను చెబుతున్నామని చెప్పారు. నిర్మలా సీతారామన్ గారూ.. మీరు మీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఎదుటి వారి భాష గురించి, ఇతర అంశాల గురించి మాట్లాడటం మానేసి చిత్తశుద్ధితో పనిచేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.