త్వరలో కొత్తగా విద్యుత్తు పాలసీ
తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు

- అసెంబ్లీలోనూ, నిపుణులతో విస్తృత చర్చ
- 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు
- గృహజ్యోతి 200 యూనిట్లకు ఏర్పాట్లు
- 2014 నుంచి జరిగిన ఒప్పందాలు,
- చెల్లించిన ధరలపై సమగ్ర నివేదిక ఇవ్వండి
- ఎక్కువ ధర ఎందుకు చెల్లించారో చెప్పండి
- తక్కువకు దొరికే చోటే విద్యుత్తు కొనాలి
- ఇతర రాష్ట్రాల విద్యుత్తు విధానాల అధ్యయనం
- విద్యుత్తు శాఖ సమీక్షలో సీఎం రేవంత్
విధాత, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్తు రంగ నిపుణులతో వివిధ రాష్ట్రాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి దీనికి రూపకల్పన చేస్తామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్తు శాఖ అధికారులతో బుధవారం ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు.
విద్యుత్తు వినియోగం, 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు సరఫరా, విద్యుత్తు సంస్థల ఉత్పత్తి, కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటివాటిపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి, వివిధ విద్యుత్తు కంపెనీల నుంచి విద్యుత్తు కొనుగోళ్లు, రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం, డిస్కంల పనితీరు, ఆర్థిక పరిస్థితిపై వివరాలను సీఎంకు అధికారులు వివరించారు.
ఇప్పటిదాక జరిగిన ఒప్పంద వివరాలు అందించాలి
తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 నుంచి ఇప్పటిదాకా విద్యుత్తు కంపెనీలకు, విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి మధ్య జరిగిన ఒప్పందాలు, ఆ ఒప్పందాల్లోని అంశాలు, విద్యుత్తుకు చెల్లించిన ధరలు వంటివాటిపై సమగ్రంగా అధ్యయనం చేసి, పూర్తి వివరాలను అందించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఆర్థిక సంవత్సరాలవారీగా జరిగిన ఒప్పందాలను, వాటిలోని అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పారు. ఎక్కువ ధర చెల్లించే విధంగా జరిగిన ఒప్పందాలకు కారణాలేమిటో కూడా నివేదించాలని ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో, ఆ కంపెనీల నుంచే విద్యుత్తు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు.
ఇప్పటిదాకా సరైన విద్యుత్తు పాలసీ రూపొందించక పోవడంతో వివిధ రకాల ఇబ్బందులు, సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యుత్తు విధానాలను అధ్యయనం చేయాలని, ఆ రాష్ట్రాల్లోని విద్యుత్తు పరిస్థితులు, మెరుగైన విధానం ఏ రాష్ట్రంలో ఉందో నివేదికలను ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అన్ని రాష్ట్రాలకంటే మెరుగైన విధానాన్ని తెలంగాణలో అమలు చేయడానికి నిపుణులతో చర్చించి, అసెంబ్లీలోనూ అన్ని రాజకీయపార్టీల ప్రజా ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించి, సరికొత్త విద్యుత్తు పాలసీని తీసుకు వస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
24 గంటల ఉచిత విద్యుత్తు.. 200 యూనిట్ల గృహజ్యోతి
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ప్రభుత్వ పరంగా విద్యుత్తు ఉత్పత్తిని పెంచడానికి, మరిన్ని విద్యుత్తు సంస్థలను ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తు దుర్వినియోగాన్ని అరికట్టాలని, నాణ్యతను పెంచాలని సూచించారు.
విద్యుత్తును నిరంతరం సరఫరా చేయడంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా పటిష్టంగా, ముందస్తు చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి.శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ట్రాన్స్ కో సీఎండీ రిజ్వీ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషార్రఫ్ ఫారూఖీ, సీఎంవో అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.