కేసీఆర్ సంకల్పంతో పెరిగిన పచ్చదనం: మంత్రి జగదీష్ రెడ్డి విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: సీఎం కేసీఆర్ సంకల్పించిన హరితహారం పథకంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని, తెలంగాణ ఆవిర్భావం పిదప 240 కోట్ల మొక్కలు నాటడం జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలో చేపట్టిన ఒక్క రోజులో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొన్ని దేశాల్లో ఆక్సిజన్ కొనుక్కుంటున్నారని, భారతదేశంలోనూ ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితులు […]
విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: సీఎం కేసీఆర్ సంకల్పించిన హరితహారం పథకంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని, తెలంగాణ ఆవిర్భావం పిదప 240 కోట్ల మొక్కలు నాటడం జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు.
నల్గొండ పట్టణంలో చేపట్టిన ఒక్క రోజులో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొన్ని దేశాల్లో ఆక్సిజన్ కొనుక్కుంటున్నారని, భారతదేశంలోనూ ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితులు ఎదురు కాకుండా అంతా మొక్కలు నాటి సంరక్షణ చేయాలన్నారు.
పర్యావరణం పరిరక్షణ ఆవశ్యకత తెలిసిన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని ఆరు శాతం నుండి 33శాతం పెంచే లక్ష్యంతో హరితహారాన్ని చేపట్టారన్నారు. నేడు రాష్ట్రంలో పెరిగిన పచ్చదనంతో సకాలంలో వర్షాలు పడేందుకు ఆస్కారం ఏర్పడిందన్నారు .100 శాతం ఆక్సిజన్ పీల్చు కోవాలంటే ప్రతీ మనిషి ఆరు మొక్కలు నాటాలన్నారు.
కొన్ని విదేశాల్లో మనిషికీ ఆరు వేల మొక్కలు నాటబడ్డాయన్నారు. మరికొన్ని దేశాల్లో వివాహాలు, పిల్లల కోసం పౌరులు ఖచ్చితంగా మొక్కలు నాటాలని నిబంధనలు పెట్టారన్నారు. మొక్కలు నాటి సంరక్షించుకుని భవిష్యత్ తరాలకు ఆరోగ్య కరమైన వాతావరణం ఇవ్వాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు.
మొత్తం నల్గొండ పట్టణంలో ఇప్పటికే 15 లక్షల పైగా మొక్కలు నాటారని, తాజాగా చేపట్టిన లక్ష మొక్కలు కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పానగల్లో నిర్మించిన సైనిక సంక్షేమ భవన్ నూతన కార్యాలయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.
కార్యక్రమంలో సీఎంవో ప్రత్యేక కార్యదర్శి ప్రియాంక నర్గీస్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, గ్రంధాలయం చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.వి. రమణాచారి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.