విధాత, హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న 5,368 పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉత్తర డిస్కమ్(టీజీ ఎన్పీడీసీఎల్)లో 2,170పోస్టులు, తెలంగాణ దక్షిణ డిస్కమ్(టీజీ ఎస్పీడీసీఎల్) లో 2,005ఉద్యోగాలు, తెలంగాణ ట్రాన్స్ కో లో 703, తెలంగాణ జెన్కో లో 490 ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో త్వరలోనే ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. బీటెక్ బీఈ, డిప్లొమా, ఐటీఐ అభ్యర్థులతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారిగా భర్తీ కానున్న పోస్టులు
ఎన్పీడీసీఎల్ లో 44 అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ), 30 సబ్ ఇంజనీర్, 2,090 జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం) పోస్టులు.. ఎస్పీడీసీఎల్లో 45 అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ), 30 సబ్ ఇంజనీర్లు, 1650 జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం) పోస్టులకు నియామకాలు చేపడతారు. ఇక తెలంగాణ ట్రాన్స్ కోలో 437 అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ), 63 సబ్ ఇంజనీర్, 189 జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం), 14 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్/జూనియర్ పర్స నల్ ఆఫీసర్ పోస్టులతో కలిపి 703 పోస్టులు రిక్రూట్ చేస్తారు. తెలంగాణ జెన్ కోలో 175 ఏఈ, 150 సబ్ ఇంజనీర్, 165 జూని యర్ అకౌంట్స్ ఆఫీసర్/ జూనియర్ పర్సనల్ ఆఫీసర్/ కెమిస్ట్/జూనియర్ పర్సనల్ అటెండెంట్ పోస్టులతో కలిపి 490 పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో.. బీటెక్/ బీఈ పూర్తి చేసిన అభ్యర్థులతో 701 ఏఈ, పాలిటెక్నిక్ లో ఎలక్ట్రికల్ డిప్లొమా చేసిన అభ్యర్థులతో 509 సబ్ జూనియర్ ఇంజనీర్, ఐటీఐలో ఎలక్ట్రిషియన్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు.