చైర్మన్, వైస్ చైర్మన్ ఎత్తుకు కౌన్సిలర్ల పై ఎత్తు పార్టీకి రాజీనామాకు సిద్ధపడ్డ కౌన్సిలర్లు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూపాల్ పల్లి మున్సిపాలిటీలో నెలకొన్న అసమ్మతి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. నిన్న మంగళవారం రాత్రి రాజీనామాకు సిద్ధమంటూ మునిసిపల్ చైర్మన్ వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లేఖలు ఇచ్చి అసమ్మతి కౌన్సిలర్లను ఆశ్చర్యపరిచారు. దీంతో భూపాల్ పల్లి అసమ్మతి రాజకీయం రసకందాయంలో పడింది. బుధవారం […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూపాల్ పల్లి మున్సిపాలిటీలో నెలకొన్న అసమ్మతి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. నిన్న మంగళవారం రాత్రి రాజీనామాకు సిద్ధమంటూ మునిసిపల్ చైర్మన్ వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లేఖలు ఇచ్చి అసమ్మతి కౌన్సిలర్లను ఆశ్చర్యపరిచారు. దీంతో భూపాల్ పల్లి అసమ్మతి రాజకీయం రసకందాయంలో పడింది.
బుధవారం సాయంత్రం అసమ్మతి కౌన్సిలర్లు అదే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి చైర్మన్, వైస్ చైర్మన్ లను తొలగించకుంటే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తామంటూ లేఖలు రాసి ఎమ్మెల్యే కు అందజేసేందుకు ప్రయత్నించారు. కౌన్సిలర్ల ఈ రాజీనామా నిర్ణయంతో ఎమ్మెల్యే గండ్ర ఇరుకునపడ్డారు.
చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎత్తులకు పై ఎత్తు వేస్తూ కౌన్సిలర్లు ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎమ్మెల్యే కు ఏం చేయాలో పాలు పోక అసమ్మతి కౌన్సిలర్ల పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. వారిచ్చిన లేఖలు స్వీకరించేందుకు కూడా ఆయన అంగీకరించలేదు. కౌన్సిలర్ల డిమాండ్ పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో తాడోపేడో తేల్చుకునేందుకు 20 మంది అసమ్మతి కౌన్సిలర్లు సిద్ధమయ్యారు.
ఇదిలా ఉండగా చైర్మన్, వైస్ చైర్మన్ ల రాజీనామాకు సిద్ధమంటూ ఇచ్చిన లేఖల డ్రామా వెనుక సూత్రధారి ఎమ్మెల్యే అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ లకు ఎమ్మెల్యే మద్దతునిస్తున్నారని గట్టి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే పై అసమ్మతి కౌన్సిలర్లు అపనమ్మకంతో ఉన్నారు.
భూపాల్ పల్లి మున్సిపాలిటీలో నెలకొన్న అసమ్మతి రాజకీయం రసకందాయంలో పడినట్లు భావిస్తున్నారు. కౌన్సిలర్లు వర్సెస్ చైర్మన్, వైస్చైర్మన్లుగా కొనసాగుతున్న రాజకీయ విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఈ సంక్షోభం ఎమ్మెల్యే కు ఉచ్చుగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇటు తన మద్దతుదారులుగా భావిస్తున్న చైర్మన్, వైస్ చైర్మన్ లను తొలగించలేక కౌన్సిలర్లకు నమ్మకం కలిగించలేక వెంకటరమణ రెడ్డి ఇరుకున పడిపోయారు. ఇప్పటికే నియోజకవర్గంలో గులాబీ పార్టీలో గండ్రకు ప్రధాన ప్రత్యర్థిగా ఎమ్మెల్సీ మధుసూదనా చారి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ స్థితిలో జిల్లా కేంద్రంలో నెలకొన్న ఈ సమస్య తీవ్ర రూపం దాలిస్తే గండ్ర వెంకటరమణ రెడ్డికీ మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. దీనికి తోడు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు సైతం నియోజక వర్గంలో బలమైన శక్తి గానే ఉన్నాయి. కౌన్సిలర్లు పట్టుబట్టి పార్టీకి రాజీనామా చేస్తే ప్రత్యర్థి పార్టీలో చేరే ప్రమాదం ఉంది. ఇది గండ్రకు మింగుడు పడని విషయంగా మారనుంది.