పేదల పక్షాన పోరాడేది ఎర్రజెండా: చాడ వెంకటరెడ్డి
రాష్ట్రంలో పేద ప్రజలు వేసుకున్న గుడిసెలకు ఈ ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని సీపీఐ చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు

– గుడిసెలకు పట్టాలు ఇవ్వకుంటే
గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుంది
– హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి
– సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో పేద ప్రజలు వేసుకున్న గుడిసెలకు ఈ ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎర్ర చెరువు 280 సర్వే నంబర్ లో గత సంవత్సరం గుడిసెలు వేసుకొని జీవిస్తున్న భగత్ సింగ్ నగర్ కాలనీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కల్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తో కలిసి పార్టీ కార్యాలయాన్ని చాడ వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అనేక హామీలను విస్మరించిందని, ప్రతిఫలంగానే రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. అట్లాగే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకే సీపీఐ పార్టీ కాంగ్రెస్ కు మద్దతు పలికిందని అన్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరారు. నిరంకుశ పాలన నుండి ఇప్పుడే ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని, గత ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ప్రగతి భవన్ కు వేసిన కంచెను తొలగించారని తెలిపారు. గత ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనంగానే ప్రజలు ప్రజాస్వామ్య పాలన కోరుకున్నారని, ప్రజల ఆశలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలో పేదల పక్షాన పోరాడే ఏకైక పార్టీ ఎర్రజెండా సీపీఐ పార్టీ అని అన్నారు. భగత్ సింగ్ కాలనీవాసుల సమస్యలను ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు, నీళ్లు, కరెంటు, రోడ్లు వేయాలని చాడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదల పక్షాన పోరాడేది సీపీఐ పార్టీ అని, గత సంవత్సరం నుండి ఎర్ర చెరువులో గుడిసెలు వేసుకొని ఉంటున్న కాలనీవాసులకు పార్టీ అండగా నిలిచిందని అన్నారు.
గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలను ఇస్తానని చెప్పి మోసం చేసిన ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను విస్మరించిందని, అందుకే తగిన మూల్యం ఆ ప్రభుత్వం చెల్లించిందని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల పక్షాన కొట్లాడి మీకు పట్టాలి ఇచ్చేంతవరకు ఈ ఎర్రజెండా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, రాష్ట్ర సమతి సభ్యులు బోయిని అశోక్, సీపీఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ కుమార్, క్యాతారాజ్ సతీష్, జిల్లా కమిటీ సభ్యులు కొరిమి సుగుణ, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, అరబోయిన వెంకటేష్, పీక రవి, లావణ్య, రమేష్, గోలి లావణ్య పాల్గొన్నారు.