కేసీఆర్ కుటుంబ అవినీతి కార‌ణంతో కాళేశ్వ‌రం బ‌లి : రేవంత్ రెడ్డి

కేసీఆర్ కుటుంబ అవినీతి కార‌ణంతో కాళేశ్వ‌రం బ‌లి : రేవంత్ రెడ్డి
  • ఎల్అండ్‌టీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి
  • 25 నుంచి 1వ పిల్ల‌ర్ వ‌ర‌కు కుంగింది
  • కార‌కుల‌పై క్రిమిన‌ల్ కేసులు పెట్టాలి
  • బీఆరెస్ అవినీతికి బీజేపీ ర‌క్ష‌ణ‌
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

విధాత‌, హైద‌రాబాద్‌: కేసీఆర్ కుటుంబం అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం మేడిగ‌డ్డ‌ను ప‌రిశీలించిన త‌రువాత శంషాబాద్ విమానాశ్ర‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ గుడినీ గుడిలో లింగాన్ని దిగమింగిన కేసీఆర్ ను తెలంగాణ సమాజం శిక్షించాలన్నారు. కేసీఆర్ పాపం పండింది… కేసీఆర్ అవినీతి కుండ పగిలింది.. మేడిగడ్డ కుంగిందని అన్నారు. లక్ష కోట్ల ప్రజాధనం గోదావరిలో పోసిన పన్నీరయిందని తెలిపారు. బీఆరెస్ అవినీతిని బీజేపీ కాపాడుతోందన్నారు. బీఆరెస్, బీజేపీ అవినీతికి ప్రాజెక్టు బలైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ బలి తీసుకుంటే.. కేసీఆర్ ను కాళేశ్వరం ప్రాజెక్టు బలి తీసుకుంటుందని తెలిపారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాళేశ్వరం కర‌ప్ష‌న్‌ రావు అనే పరిస్థితి వచ్చిందన్నారు.

నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయన్నారు. 25వ పిల్లర్ నుంచి 1వ పిల్లర్ వరకు పూర్తిగా కుంగిపోయిందని తెలిపారు. పిల్లర్స్ రెండున్నర ఫీట్లు కుంగిపోయిందని అధికారులే స్వయంగా చెబుతున్నారన్నారు. మెడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి ఏర్ప‌డింద‌ని మిగతా సగం ప్రాజెక్టు పరిస్థితి కూడా సాంకేతిక నిపుణులు పరిశీలిస్తేనే ఏమిటనేది తెలుస్తోంద‌న్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేసిన ఎల్ అండ్ టీ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు. సంబంధిత ఇంజనీర్లు, సీడీఓ పై క్రిమినల్ కేసులు పెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు.

మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఓడిపోతారని బీఆరెస్ కు స్పష్టత వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే కేసీఆర్ కేంద్రం సహకారంతో కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించి తీరుతామ‌న్నారు. మోడీ కంకణం కట్టుకుని కేసీఆర్ ను గెలిపించాలనుకున్నా అది జరగదన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సమాజం తిప్పికొడుతుంది… కేసీఆర్ ను పడగొడుతుందని తెలిపారు.