నామినేటెడ్ పదవుల్లో 50శాతం బీసీలకు ఇవ్వాలి

నామినేటెడ్‌, కార్పొరేషన్‌ పోస్టుల్లో బీసీలకు 50 శాతం పదవులు ఇవ్వాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి కి రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య లేఖ రాశారు

  • By: Somu    latest    Jan 27, 2024 10:58 AM IST
నామినేటెడ్ పదవుల్లో 50శాతం బీసీలకు ఇవ్వాలి
  • సీఎం రేవంత్‌రెడ్డికి ఆర్‌. కృష్ణయ్య లేఖ


విధాత, హైదరాబాద్ : నామినేటెడ్‌, కార్పొరేషన్‌ పోస్టుల్లో బీసీలకు 50 శాతం పదవులు ఇవ్వాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి కి రాజ్యసభ సభ్యులు,బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య లేఖ రాశారు. శుక్రవారం బీసీ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో లేఖ వివరాలను ఆయన వెల్లడించారు. మంత్రివర్గంలో 50 శాతం కోటా బీసీలకు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరామని ఆయన తెలిపారు. ఇటీవల సీఎం ప్రకటించిన నలుగురు ప్రభుత్వ సలహాదారులలో ఒక్కరూ బీసీలు లేకపోవడం బాధాకరమన్నారు.


ఇక మీదట భర్తీ చేయబోయే ప్రభుత్వ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్‌, దేవాదాయ కమిటీలు, ఇతర నామినెటేడ్‌ పదవుల్లో బీసీలకు 50 శాతం పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలు మద్దతు ఇచ్చారని, పార్టీలోని సమర్థులైన నాయకులకు పదవులు ఇవ్వాలని కోరామన్నారు. వచ్చే బడ్జెట్‌లో బీసీలకు 20 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించాలని, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు పూర్తి ఫీజు మంజూరు చేయాలని, బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి బీసీ కుటుంబానికి 20 లక్షలు మంజూరు చేయాలని కోరినట్లుగా తెలిపారు.