అమృత్ కలశ్ పథకం గడువును పొడిగించిన ఎస్బీఐ.. ఎప్పటి వరకో తెలుసా..?
ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఇండియా మరోసారి ఫిక్స్డ్ డిపాజిట్ పథకం ‘అమృత్ కలశ్’ గడువును పొడిగించింది

SBI Amrit Kalash | ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఇండియా మరోసారి ఫిక్స్డ్ డిపాజిట్ పథకం ‘అమృత్ కలశ్’ గడువును పొడిగించింది. ప్రస్తుతం స్కీమ్లో పెట్టుబడి పెట్టేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ముగియనున్నది. ఈ క్రమంలో గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి ఈ పథకం ద్వారా బ్యాంకు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నది. తక్కువ సమయంలో పెట్టుబడితో మంచి వడ్డీ పొందాలని భావించే వారికి ఈ ప్లాన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
వడ్డీ రేటు ఎలా ఉంటుంది..?
ఎస్బీఐ అమృత్ కలశ్ పథకం కాల వ్యవధి 400 రోజులు ఉంటుంది. ఇందులో రూ.2కోట్ల వరకు డిపాజిట్ చేసే సాధారణ పౌరులకు ఏడాదికి 7.1శాతం వడ్డీని బ్యాంకు అందిస్తుంది. ఇదే గడువు సీనియర్ సిటిజన్లకు ఏకంగా 7.6శాతం వడ్డీని చెల్లిస్తుంది. డిపాజిట్ స్కీమ్పై వచ్చే వడ్డీ చెల్లింపు కోసం నెల, మూడు నెలలు, ఆరు నెలలు వంటి ఆప్షన్స్ ఉంటాయి.
ఇందులో ఎంపిక చేసుకున్న దాన్ని బట్టి ఆయా నెలలకోసారి వడ్డీ జమవుతుంది. రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, ఎన్ఆర్ఐ రూపాయి టర్మ్ డిపాజిట్లు రెండింటికీ అమృత్ కలశ్ స్కీమ్ వర్తిస్తుంది. కొత్తగా డిపాజిట్ చేయడంతో పాటు, పాత డిపాజిట్ను సైతం రెన్యూవల్ చేసుకునే వీలుంటుంది. టర్మ్ డిపాజిట్ అండ్ స్పెషల్ టర్మ్ డిపాజిట్ సౌకర్యం సైతం అందుబాటులో ఉంచింది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
డిపాజిట్ స్కీమ్లో చేరేందుకు దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో సంప్రదించవచ్చు. ఇంటర్నెట్, ఎస్బీఐ యోనో యాప్ ద్వారా సైతం స్కీమ్లో చేరేందుకు అవకాశం ఉంది. ఈ స్కీమ్ను మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే రద్దు చేసుకునే అవకాశం సైతం కల్పిస్తున్నది. అయితే, డిపాజిట్ మీద బ్యాంకు లోన్ సైతం ఇస్తుండడం విశేషం. అమృత్ కలశ్ పథకంపై మీరు తీసుకునే వడ్డీపై ఇన్కం టాక్స్ రూల్స్ ప్రకారం టీడీఎస్ కట్ అవుతుంది. ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను పత్రాలను దాఖలు చేసే సమయంలో క్లెయిమ్ చేసుకునే అవకాశం సైతం ఉంది.