పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

విధాత, హైద‌రాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న పోడు వ్యవసాయదారులకు సమస్యలపై శాశ్వత పరిష్కారం తో పాటు భవిష్యత్తులో అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా చేపట్టే సంరక్షణ చర్యలపై బుధ‌వారం అర‌ణ్య భ‌వ‌న్‌లో జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ చైర్మ‌న్‌గా మంత్రి అధ్య‌క్ష‌త‌న స‌మావేశం నిర్వ‌హించారు. జిల్లా, మండలం, […]

  • By: Somu    latest    Sep 14, 2022 10:45 AM IST
పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

విధాత, హైద‌రాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న పోడు వ్యవసాయదారులకు సమస్యలపై శాశ్వత పరిష్కారం తో పాటు భవిష్యత్తులో అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా చేపట్టే సంరక్షణ చర్యలపై బుధ‌వారం అర‌ణ్య భ‌వ‌న్‌లో జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ చైర్మ‌న్‌గా మంత్రి అధ్య‌క్ష‌త‌న స‌మావేశం నిర్వ‌హించారు.

జిల్లా, మండలం, గ్రామపంచాయతీ స్థాయిలో క‌మిటీ ఏర్పాటు, క‌మిటీల బాధ్య‌త‌, క్షేత్రస్థాయిలో పోడు భూముల ప‌రిశీల‌న‌, అడవులను సంరక్షించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి స‌మావేశంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి చ‌ర్చించారు. ఈ సందర్భంగా ఆయన అడవులను రక్షించడానికి, సంరక్షించడానికి జిల్లా, మండల, గ్రామ పంచాయితీ స్థాయిలో స‌మ‌గ్రంగా చ‌ర్చించి, ఏకాభిప్రాయానికి రావ‌డం, అట‌వీ స‌రిహ‌ద్దుల‌ ను నిర్దిష్టంగా గుర్తించి, భవిష్య‌త్‌లో అటవీ భూమి ఆక్రమణలకు గురికాకుండా సమిష్టి బాధ్య‌త‌గా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌న్నారు.

పోడు సాగులో ఉన్న భూములపై ​​దాఖలైన క్లెయిమ్‌లను బేరీజు వేయ‌డం, పోడు కోసం ఆక్రమణకు గురైన అట‌వీ భూమిని అంచనా వేయడం, పోడు సమస్య జిల్లా స్థాయిలో పరిష్కారానికి అందుబాటులో ఉన్న అవకాశాలు, వనరులను ఉప‌యోగించుకోవ‌డం, త‌దిత‌ర‌ అంశాలపై మంత్రి చర్చించారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఈ సందర్భంగా సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుపేదలకు న్యాయం జరగడంతో పాటు అటవీ సంరక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. సుదీర్ఘమైన పోడు సమస్య శాశ్వత పరిష్కారానికై ముఖ్యమంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించి, గిరిజనుల్లో ధైర్యం నింపారని, ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీల ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేర‌కు ఈ నెల 11న ప్రభుత్వం జీవో నం. 140 జారీ చేసిందన్నారు.

సంబంధిత అన్ని జిల్లాల్లో కూడా సమన్యయ కమిటీల సమావేశం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. స‌మావేశంలో అట‌వీ శాఖ స్పెష‌ల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఫ్ ఆర్.ఎం.డొబ్రియ‌ల్, ఎమ్మెల్యేలు జోగు రామ‌న్న‌, కోనేరు కోణ‌ప్ప‌, విఠ‌ల్ రెడ్డి, రేఖా శ్యాంనాయ‌క్, దివాక‌ర్ రావు, ఆత్రం స‌క్కు, రాథోడ్ బాపురావు, దుర్గం చిన్న‌య్య‌, ఎమ్మెల్సీ దండే విఠ‌ల్, పీసీసీఎఫ్ (ప్రొడక్ష‌న్) ఎం.సీ ప‌ర్గెయిన్, పాల్గొన్నారు.