హైదరాబాద్లో నకిలీ మైసూర్ శాండల్ సబ్బులు తయారు చేస్తున్న ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది
విధాత: హైదరాబాద్లో నకిలీ మైసూర్ శాండల్ సబ్బులు తయారు చేస్తున్న ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ నకిలీ దందా వెనుకాల ఉన్న బీజేపీ నాయకుల బండారం బయట పెట్టాలని పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం శ్రీనివాస్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. నకిలీ మైసూర్ శాండల్ సబ్బులను తయారు చేస్తున్న ఇద్దరు బీజేపీ కార్యకర్తలను నాలుగు రోజుల క్రితం మలక్ పేట్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. వీరు కర్ణాటకలోని బీజేపీ రాష్ట్ర నాయకుల ప్రోత్సాహంతోనే ఈ దందా నడుపుతున్నట్లు కర్ణాటక రాష్ట్ర ఐటీ మంత్రి పేర్కొన్నారన్నారు.
మైసూర్ శాండల్ సబ్బుకు తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఆదరణ ఉన్న రీత్యా, నకిలీవి తయారుచేసి అమ్ముకుంటూ ఈ ముఠాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. హైదరాబాదులో అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తులకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో దగ్గర సంబంధాలు ఉన్నాయని శ్రీనివాస్ ఆరోపించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో ఫొటోలు దిగినవి బయటికి వచ్చాయన్నారు. నకిలీ సబ్బులు దందా నడుపుతున్న ముఠా వెనకాల ఎవరెవరున్నారో పూర్తి విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.