తెలంగాణ ఉద్యమకారుడు మల్లికార్జున్ మృతి.. 14 ఏండ్లు చెప్పులు ధరించకుండా నిరసన
ఉద్యమకారుల పట్ల సర్కార్ నిర్లక్ష్యం మల్లిఖార్జున్ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గజ్జి మల్లికార్జున్ గుండెపోటుతో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. సామాన్య కుటుంబంలో పుట్టిన మల్లికార్జున్ తెలంగాణ పట్ల పట్టుదలతో ఉండేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు చెప్పులు వేసుకోనని ప్రకటించి 14 ఏళ్లు చెప్పు లేకుండా నడిచిన ఉద్యమకారుడు మల్లికార్జున్ అప్పట్లో చర్చనీయాంశంగా మారారు. మృతుడు […]

- ఉద్యమకారుల పట్ల సర్కార్ నిర్లక్ష్యం
- మల్లిఖార్జున్ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి
విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గజ్జి మల్లికార్జున్ గుండెపోటుతో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. సామాన్య కుటుంబంలో పుట్టిన మల్లికార్జున్ తెలంగాణ పట్ల పట్టుదలతో ఉండేవారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు చెప్పులు వేసుకోనని ప్రకటించి 14 ఏళ్లు చెప్పు లేకుండా నడిచిన ఉద్యమకారుడు మల్లికార్జున్ అప్పట్లో చర్చనీయాంశంగా మారారు. మృతుడు మల్లికార్జున్కు భార్య, పిల్లలు ఉన్నారు. ఆయన ఆకస్మిక మృతిపట్ల తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతునికి సంతాపం తెలియజేశారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఉద్యమకారులను విస్మరించిన బీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాలుగా ఉద్యమంలో ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిలో తమ వంతు పాత్ర పోషించారు. వేలాదిమంది త్యాగం, పట్టుదల వల్ల తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. తొలిదశ, మలిదశ ఉద్యమాల ఫలితంగా రాష్ట్రం సిద్దించింది.
ఈ పునాదులపై సీఎంగా అవకాశం దక్కిన కేసీఆర్, తెలంగాణ ఉద్యమకారులను తగిన రీతిలో పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభుత్వం త్యాగం చేసిన వారిని పట్టించుకోకుండా తమ అధికారానికి ప్రాధాన్యత ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనేక మంది ఉద్యమంలో నష్టపోయిన వారిని ఆదరించకుండా నిర్లక్ష్యం చేసిందనే విమర్శలున్నాయి.
రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేకమంది వివిధ పద్ధతులలో త్యాగాలు చేసి ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు సర్వశక్తులు వినియోగించారు. తెలంగాణ రాష్ట్రం ఫలించిన తర్వాత త్యాగాలకు పాల్పడిన ఉద్యమకారుల కుటుంబాలను, ఉద్యమకారులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
మల్లికార్జున్ను పట్టించుకోలేదు: భిక్షపతి
ఉద్యమకారులను విస్మరించిన టీఆర్ఎస్, తెలంగాణ ఉద్యమకారుడు మల్లికార్జున్ గురించి కూడా పట్టించుకోలేదని ములుగు జిల్లా జేఏసీ కన్వీనర్ ముంజ భిక్షపతి గౌడ్ విమర్శించారు. సోమవారం మల్లికార్జున్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మల్లికార్జున్ కు కనీస ఉపాధి అవకాశాలు కానీ, డబల్ బెడ్ రూమ్ లాంటి ఇంటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన తర్వాత అధికార పార్టీ నాయకులు సానుభూతి ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి సంతాపం
ములుగు జిల్లాకు చెందిన గజ్జి మల్లిఖార్జున్ మృతి పట్ల ఐటి పురపాలక మంత్రి కేటీఆర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న మల్లికార్జున్ ఆకస్మికంగా తుదిశ్వాస విడవడం బాధాకరమన్నారు.
కుటుంబానికి ఎర్రబెల్లి వ్యక్తిగతంగా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. మల్లికార్జున్ కుటుంబనికి అండగా ఉంటాను అని హామీనిచ్చారు. బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. మల్లికార్జున్ కుటుంబానికి అండగా ఉంటామని పిల్లల చదువులు, ఒక్కరికి ఉద్యోగం, కుటుంబం పూర్తి బాధ్యత నాదే అని మల్లికార్జున్ భార్య పిల్లలతో మాట్లాడారు.
కుటుంబాన్ని ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మల్లికార్జున్, రాష్ట్ర రెడ్న్కో చైర్మన్ సతీశ్ రెడ్డి తో కలిసి పరామర్శించారు. కేటీఆర్తో మాట్లాడించి భరోసా నింపారు.