కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచీ రాష్ట్ర రెవెన్యూ పెరుగుదల సుస్పష్టంగా కనిపిస్తోందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచీ రాష్ట్ర రెవెన్యూ పెరుగుదల సుస్పష్టంగా కనిపిస్తోందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంతకంతకు పెరుగుతుండటం వృద్ధికి సంకేతమని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరిందని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడూ లేనంతగా రూ.13,703.92 కోట్ల మేర వసూలైందని, ఇది 11 నెలల సగటు రాబడి రూ.11,286 కోట్ల కంటే రూ.2,400 కోట్లు ఎక్కువని తెలిపాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఒడిదుడుకులకు తావు లేకుండా సుస్థిరంగా పుంజుకుంటోందని పేర్కొన్నాయి.
స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం క్రమంగా పెరుగుతోందని, కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన డిసెంబర్ నెలలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1300 కోట్లు ఉంటే 2024 జనవరిలో రూ.1044 కోట్లు. ఫిబ్రవరిలో తిరిగి రూ. 1282 కోట్లకు చేరుకుందని వివరించాయి. రాష్ట్ర జీఎస్టీ ద్వారా డిసెంబర్లో రూ. 4100 కోట్లు ఆదాయం రాగా, జనవరిలో రూ.3848 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 4446 కోట్లకు చేరిందని తెలిపాయి. మొత్తం పన్నుల ద్వారా వచ్చే టాక్స్ రెవిన్యూ పెరిగిందని, డిసెంబర్లో రూ.12609 కోట్ల ఆదాయం రాగా, జనవరిలో రూ.10748 కోట్లు, ఫిబ్రవరిలో అత్యధికంగా రూ.13703 కోట్లుగా నమోదైందని పేర్కొన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2022–23)తో పోలిస్తే 13 శాతం వృద్ధి నమోదైందని తెలిపాయి.