WARANGAL | ఆ.. ఇద్దరు BRS ఎమ్మెల్యేలు టార్గెట్గా తిరుగుబావుటా!
WARANGAL | BRS | బీఆర్ఎస్ పరువు బజారు పాలు అధిష్టానం మౌనం వెనుక మతల భేమిటి? కావాలని చాన్స్ తీసుకుంటున్నారా! అంతుబట్టని బీఆర్ఎస్ వ్యూహం మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి ప్రేక్షకపాత్ర విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్యేలు టార్గెట్గా రెండు నియోజకవర్గాల్లో మహిళలు తిరుగుబాటు బావుటాను ఎగురవేసి తీవ్ర ఆరోపణలు చేస్తున్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కానీ, వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు గానీ కనీసం స్పందించకపోవడంలో మతలబు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీ పరువు బజారున పడినప్పటికీ […]

WARANGAL | BRS |
- బీఆర్ఎస్ పరువు బజారు పాలు
- అధిష్టానం మౌనం వెనుక మతల భేమిటి?
- కావాలని చాన్స్ తీసుకుంటున్నారా!
- అంతుబట్టని బీఆర్ఎస్ వ్యూహం
- మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి ప్రేక్షకపాత్ర
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్యేలు టార్గెట్గా రెండు నియోజకవర్గాల్లో మహిళలు తిరుగుబాటు బావుటాను ఎగురవేసి తీవ్ర ఆరోపణలు చేస్తున్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కానీ, వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు గానీ కనీసం స్పందించకపోవడంలో మతలబు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీ పరువు బజారున పడినప్పటికీ ఎవరు నోరుమెదపకపోవడంలో మర్మమేమిటనే ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఈ ప్రేక్షకపాత్ర అనేక అనుమానాలు తావిస్తోంది. గత కొద్ది రోజులుగా జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల పైన తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోపణలు చేసే వారు కూడా ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు కాకపోవడం ఇక్కడ విశేషం. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పైన తీవ్ర ఆరోపణలు బాహాటంగానే చేస్తున్నారు.
ముత్తిరెడ్డిపై ఆరోపణలు చేసేది స్వయంగా తన కనబిడ్డ కావడం ఆశ్చర్యానికిలోను చేస్తుండగా, ఇక తాడికొండ రాజయ్యపై ఆరోపణలు చేసేది తమ పార్టీకి, తన నియోజక వర్గానికి చెందిన మహిళా సర్పంచ్ కావడం గమనార్హం. ప్రత్యర్ధులు, ఇతరులు ఆరోపణలు చేస్తే పట్టించుకోకపోవడం అనేదానికి ఓ కారణం ఉంది. కానీ, సొంత పార్టీకి చెందిన వారూ, అందులో మహిళలు ఆరోపణలు చేసినా ఎవరు స్పందించక పోవడం, పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. మౌనం వెనుక మతలబేమిటంటూ నిలదీస్తున్నారు.
ముత్తిరెడ్డి పైన కబ్జా ఆరోపణలు
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కబ్జా కోరు అంటూ స్వయంగా తన బిడ్డ తుల్జా భవాని రెడ్డి గత కొద్ది కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చింది. తాజాగా ఆదివారం చేర్యాలలో తన తండ్రి ఆక్రమించి, తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేస్తానంటూ బాహాటంగా ప్రకటించి సంచలనానికి తెర తీశారు.
ఈ సంఘటన వెనుక నిజానిజాలేంటిదో తేల్చాల్సిన స్థానంలో ఉన్న ప్రభుత్వంగానీ, అధికార పార్టీ పెద్దలు కానీ స్పందించకపోవడం పట్ల విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే ఆక్రమిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చూ. ఆ భూమి పట్టా భూమి, ఎమ్మెల్యే న్యాయంగానే కొనుగోలు చేసినట్లు తేలితే ప్రజలకు వివరించవచ్చూ. ఇవేమీ పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఇంకెంతకాలం సాగుతుందోననే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణ
స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై ఆయన సొంత నియోజకవర్గం ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామ సర్పంచ్, బి.ఆర్.ఎస్. పార్టీకి చెందిన నవ్య మార్చి నెలలో ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యే ఫోన్ కాల్స్ ద్వారా తనతో అసభ్యంగా మాట్లాడుతున్నారని, ఆయన అలా ప్రవర్తించడం బాధ కలిగిస్తుందని ఆరోపించారు.
ఎమ్మెల్యే చెప్పినట్లు తాను వినకపోవడంతో గ్రామానికి నిధులు ఇవ్వడం లేదని, బిల్లులు రావడం లేదని, తన దగ్గర ఆడియో రికార్డులు, వాట్సాప్ మెసేజులున్నాయని ఆమె చెప్పారు. అప్పుడు ఆమె తన భర్తతోకలిసి ఈ ఆరోపణలు చేశారు. మూడురోజుల తర్వాత తర్వాత ఎమ్మెల్యే, సర్పంచ్ ఇద్దరూ రాజీకొచ్చి కలిసి మీడియా సమావేశం పెట్టారు. ఇక ముందు ఆ పరిస్థితి తలెత్తే అవకాశం లేదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సర్పంచ్ కోరారు. మూడు నెలల తరువాత తాజాగా సర్పంచ్ నవ్య మళ్లీ మీడియా ముందుకొచ్చింది.
మళ్ళీ మొదటికొచ్చిన ఆరోపణ
ఎమ్మెల్యే రాజయ్య తన భర్తని ప్రలోభ పెట్టి తన దగ్గరున్న సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని సర్పంచ్ నవ్య ఆరోపించారు.ఆడియో, వీడియో రికార్డులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. అప్పుడు ఇస్తామని చెప్పిన గ్రామాభివృద్ధి నిధులు రూ.20 లక్షలు ఇవ్వాలంటే కాగితం రాసి సంతకం పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. తన భర్తతో బేరం కుదుర్చుకున్నాడని, తన సంతకం కోసం భర్త వత్తిడి చేసినా తాను నిరాకరించానని తెలిపారు.
తర్వాత ఈ విషయంపై ఎమ్మెల్యే,ఆయన పిఎ, ఎంపిపి, తన భర్త మీద సర్పంచ్ నవ్య పోలీస్ స్టేషన్లో రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆధారాలు సమర్పించాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా, కేసు నమోదు చేయాలని తర్వాతే ఆధారాలు సమర్పిస్తానని ఆమె తాజాగా డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కోరారు. తన ఆవేదనను, ఫిర్యాదుల్ని బీఆరెస్ పార్టీ నాయకత్వం,మంత్రులు పట్టించుకోవడం లేదని, తనను ఎవరూ సంప్రదించలేదని నవ్య ఆరోపించారు. ఈ సమస్య ఏ మలుపు తీసుకుంటుందోననే చర్చ సాగుతుంది.
ఎర్రబెల్లి, సత్యవతీ ఎందుకీ మౌనం
జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఈ రెండు నియోజకవర్గాల పరిధి జనగామ జిల్లా కు చెందిన మంత్రి ఎర్రబెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు కావడం గమనార్హం. పైగా ఆయన ఉమ్మడి జిల్లాకు మంత్రులుగా ఎర్రబెల్లి, సత్యవతి వ్యవహరిస్తున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ స్వయంగా మహిళా అయి ఉండి మహిళలు చేస్తున్న ఆరోపణలపై కనీసం నోరు మెదపకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీనికి తోడు ఇటీవల పలు సందర్భాలలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటించారు. అయినప్పటికీ ఈ విషయమై కనీసం నోరు మెదపకపోవడం ఆశ్చర్యానికి లోను చేస్తుంది. పార్టీ పక్షాన జిల్లా అధ్యక్షులు గాని, పార్టీ ప్రతినిధులుగాని జోక్యం చేసుకోకపోవడం చర్చకు దారితీస్తుంది.
ఉద్దేశపూర్వకంగానే మౌనం
మంత్రులు, అధిష్టానం మౌనం వహించడం వెనుక రెండు కారణాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సమయాల్లో బిఆర్ఎస్ పార్టీ మౌనం వహించడం ఒక ఎత్తుగడగా అమలు చేస్తుంది. ఈ లోపు సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లుతోందని ఆ పార్టీ భావిస్తోంది.
గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మానుకోట, జనగామ, పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలపై వివిధ ఆరోపణలు వచ్చిన సమయంలో ఇదే తీరుగా వ్యవహరించి కాలం దాటవేసింది. అయితే ఈసారి కూడా అదే ప్రణాళికను అమలు చేస్తుందని కొందరు వాదిస్తుండగా, దీనికి భిన్నమైన అభిప్రాయాలు మరి కొందరు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత, ఆరోపణలొచ్చిన ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే పై ఇద్దరి ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించాలంటే వారిపై వచ్చే ఆరోపణలు పైన చర్చ జరగాలని భావిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక అధిష్టానం అనుకూల వ్యక్తుల ప్రోద్బలం ఉందంటున్నారు. అయితే పార్టీ పరువు బజారుకెక్కుతుంటే మౌనం వహించడమేమిటంటూ మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. వీటికి ఎలా పుల్ స్టాప్ పెడుతుందో వేచి చూడాలి.