విధాత బ్యూరో, కరీంనగర్: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికలొస్తేనే చాకలి ఐలమ్మ, జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి తెలంగాణ ఉద్యమకారులు గుర్తుకొస్తారు. ఎన్నికలైనంక వాళ్లకు కనీసం నివాళులు అర్పించడు. ఎన్నికలొస్తున్నయనే చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఇన్నాళ్లకు కేసీఆర్ కు గుర్తుకొచ్చారా?’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు.
చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని మంగళవారం కరీంనగర్ ప్రతిమ చౌరస్తాలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంగు నడుముకు చుట్టి రజాకార్ల దాష్టీకాలపై ఎదురొడ్డి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు. ఆమె తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన పోరాట యోధురాలని, హక్కుల కోసం కొట్లాడే వారికి స్ఫూర్తిదాయకమన్నారు. అలాంటి యోధురాలిని ఇన్నాళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని, కేసీఆర్ వంటి రాజకీయ అవకాశవాది ఈ ప్రపంచంలోనే మరొకరు లేరన్నారు. ఎన్నికలైపోగానే తెలంగాణ ఉద్యమకారులు తెర మరుగై పోతారని చెప్పారు.