నీట్ ప్రవేశ పరీక్ష 2024 పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీహార్లో నీట్ పేపర్ లీకేజీపై దొరికిన తీగను లాగుతున్న కొద్ధి అక్రమాల డొంక కదులుతుంది
బీహార్లో పేపర్ లీకేజీ
విధాత, హైదరాబాద్ : నీట్ ప్రవేశ పరీక్ష 2024 పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీహార్లో నీట్ పేపర్ లీకేజీపై దొరికిన తీగను లాగుతున్న కొద్ధి అక్రమాల డొంక కదులుతుంది. బీహార్లో నీట్ పేపర్ లీకైనట్లుగా అక్కడి ఆర్థిక నేరాల విభాగం(ఈవోయూ) దృవీకరించింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్ సర్కార్ సిట్ను ఏర్పాటుచేసింది.
విచారణలో భాగంగా ఏడుగురు విద్యార్థులతో పాటు నిందితులతో సహా 14మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. మరో 9 మందికి నోటీసులు జారీ చేశారు. కాగా.. వీరు సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. పేపర్ లీకేజీని ఎన్టీఏ తోసిపుచ్చినప్పటికి బీహార్లో పేపర్ లీకేజీపై వెలుగులోకి వస్తున్న అంశాలు పేపర్ లీకేజీకి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
నీట్ పరీక్ష ఒక్క రోజు ముందుగా బిహార్ ముఠా పేపర్ లీకేజీకి పాల్పడిందని, ఓక్కో విద్యార్థి నుంచి రూ. 30-32లక్షల చొప్పున వసూలు చేసి పేపర్ను విక్రయించారని, పేపర్ కొనుగోలు చేసిన 35మంది విద్యార్థులకు పాట్నాలోని ఒక ఇంటిలో ప్రశ్నపత్రాన్ని ప్రిపేర్ చేయించారని ఇప్పటికే దర్యాప్తు బృందాలు గుర్తించాయి. నిందితుల్లో ఒకడైన ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ కూడా పేపర్ లీకేజీ ముఠాతో కలిసి తాను పనిచేసినట్లుగా విచారణలో వెల్లడించాడని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. మే 4వ తేదీన రామకృష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఈ గ్యాంగ్ నకిలీ పరీక్ష సెషన్ను నిర్వహించింది.
ఇక్కడ సమాధానాలతో కూడిన నీట్ ప్రశ్నపత్రాలను అభ్యర్ధులకు పంపిణీ చేసినట్లు వెల్లడైంది. సేషన్ అనంతరం ఆ ప్రశ్నాపత్రాలను అదే పాఠశాలలో కాల్చివేశారు. క్వశ్చన్ పేపర్ లీకైనట్లు భావిస్తోన్న పాఠశాల నుంచి కాలిపోయిన ప్రశ్నాపత్రం అవశేషాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులకు నీట్ పరీక్ష పత్రం ఎక్కడి నుంచి అందినదన్న విషయం తేలాల్సివుంది. తాజా ఆరోపణలపై జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ స్పందించాల్సి ఉంది.
ఇప్పటికే నీట్ పరీక్ష అక్రమాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా, తదుపరి విచారణ జూలై 2వ తేదీన కొనసాగనుంది. ఎన్టీఏ సైతం పరీక్ష ఫలితాలపై వచ్చిన ఆరోపణలపై కమిటీ వేసి, 67మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను ఉపసంహరించుకుని వారికి మళ్లీ ఈనెల 23న పరీక్ష నిర్వహించి వెంటనే ఫలితాలు వెల్లడిస్తామని పేర్కోంది.