Bengaluru Techie | ప్రస్తుత కాలంలో వేతనం కోసం చాలామంది ఉద్యోగులు కష్టపడుతున్నారు. పెరుగుతున్న ఖర్చులకు తోడుగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని డబ్బులు కూడాబెట్టేందుకు ఆరాటపడుతున్నారు.
Bengaluru Techie | ప్రస్తుత కాలంలో వేతనం కోసం చాలామంది ఉద్యోగులు కష్టపడుతున్నారు. పెరుగుతున్న ఖర్చులకు తోడుగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని డబ్బులు కూడాబెట్టేందుకు ఆరాటపడుతున్నారు. కొందరు డబ్బులకు ఇబ్బందులుపడుతుంటే.. మరికొందరు డబ్బులు ఎక్కువై సైతం తిప్పలుపడుతున్నారు. కానీ బెంగళూరుకు చెందిన ఓ జంట మాత్రమకు తమకు సమకూరుతున్న భారీ ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలియడం లేదు. దాంతో సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ కోరడం విశేషం. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ జంటకు నెలకు ఏకంగా రూ.7లక్షలు సంపాదిస్తున్నారు. వారికి పిల్లలు లేరు.
ఇంటి ఖర్చులు, పెట్టుబడులు పోను ఇంకా డబ్బులు మిగిలిపోతున్నది. దాంతో దాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలియడం లేదు. దాంతో సోషల్ మీడియా వేదికగా సలహాలు, సూచనలు కోరారు. భారతీయ నిపుణుల జీతాలు.. ఆఫీస్ పరిస్థితులు, ఆర్థిక విషయాలపై చర్చించే ‘గ్రేప్వైన్’ యాప్లో దంపతులు పోస్ట్ చేయగా.. ఎక్స్లో ట్రెండింగ్ మారింది. ‘గ్రేప్వైన్’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సౌమిల్ త్రిపాఠి ‘ఎక్స్’లో ఈ స్క్రీన్షాట్ను షేర్చేశారు. ‘ఇది నిజంగా అద్భుతం. ఒకప్పుడు భారతీయ వ్యాపారవేత్తలు మాత్రమే అధిక ఆదాయంతో సమస్యలు ఎదుర్కునేవారు. కానీ, నేడు సాధారణ 30 ఏళ్ల వయసున్న ఉద్యోగ కేటగిరి ధనవంతులు సైతం ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు’ అని త్రిపాఠి స్క్రీన్షాట్కు జత చేశారు.
అయితే, దంపతులు వయసు 30 కాగా.. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. నెల సంపాదన రూ.7లక్షలు కాగా.. వార్షిక బోనస్ మోసంలో రూ.2లక్షలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నట్లు దంపతులు పేర్కొన్నారు. నెలవారీ ఖర్చులు రూ.1.5 లక్షలు అవుతాయని, మంచి ఏరియాలో నివసిస్తున్నామని, కారు ఉందని చెప్పారు. ఈ ఖర్చులన్నీ పోనూ నెలాఖరుకు బ్యాంకు ఖాతాల్లో రూ.3 లక్షలకుపైగానే మిగిలి ఉంటుందని, ఈ డబ్బుని ఎలా ఉపయోగించాలో తెలియడం లేదని పేర్కొన్నారు. ఖర్చు విషయంలో ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వాలని దంపతులు కోరారు. ఉద్యోగం మానేయాలని కొందరు.. విదేశీ టూర్కు వెళ్లాలని కొందరు సూచించారు. మరికొందరు ఏదైనా స్వచ్ఛంద సంస్థలు, అనాథ శరణాలయాలకు విరాళం ఇవ్వాలని నెటిజన్లు సూచించారు.