Sahadev Soren | జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్ – మావోయిస్టు నేత సహదేవ్ సోరెన్ హతం

జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ హతమయ్యాడు. అతని తలపై కోటి రూపాయల రివార్డు ఉంది. తనతోపాటు మరో ఇద్దరు కీలక మావోయిస్టులు కూడా ఎన్​కౌంటర్​లో మరణించారు.

  • Publish Date - September 16, 2025 / 07:01 PM IST
  • సహదేవ్​ కూడా కేంద్ర కమిటీ సభ్యుడు
  • మొన్ననే మరో అగ్రనేత మోడెం బాలకృష్ణ హతం
  • అగ్ర నేతల వరుస మరణాలు – ఉద్యమానికి బీటలు

Sahadev Soren | సిపిఐ మావోయిస్ట్​ CPI (Maoist) సెంట్రల్ కమిటీ సభ్యుడు (CCM) సహదేవ్ సోరెన్  జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా కారాండో అటవీప్రాంతంలో భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతడి తలపై కోటి రూపాయల బహుమతి ఉంది.  అతడితో పాటు  తన సహచరులు – రఘునాథ్ హెంబ్రామ్ (రూ.25 లక్షలు), బీర్సెన్ గాంఝు (రూ.10 లక్షలు) కూడా ఎన్​కౌంటర్​లో మరణించారు.

ఐదు రోజుల క్రితమే చత్తీస్‌గఢ్‌లో మరో సెంట్రల్ కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ హతమైన విషయం మరువకముందే  సహదేవ్​ మరణం మావోయిస్టు ఉద్యమానికి శరాఘాతంగా మారింది. ఈ వరుస ఎన్​కౌంటర్లతో కేంద్ర కమిటీలో సభ్యుల సంఖ్య 13కి తగ్గింది. ప్రస్తుతం అందులో తెలంగాణకు చెందిన 9 మంది, జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు, చత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు మిగిలారు.
2026 మార్చి 31లోపు మావోయిస్టు ముప్పును పూర్తిగా నిర్మూలిస్తామన్న హోం మంత్రి అమిత్​ షా, ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారనడానికి ఈ ఎన్​కౌంటర్లే ఉదాహరణగా నిలుస్తున్నాయి.

CPI (Maoist) సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ఫోటో

సహదేవ్​ సొరెన్​ : భారీ ఆపరేషన్ల గతం – ఎన్‌కౌంటర్‌తో ముగిసిన జీవితం

సహదేవ్ సోరెన్ దాదాపు మూడు దశాబ్దాలుగా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. 1994లోనే మొదటిసారి భద్రతా దళాలతో సహదేవ్​ ముఖాముఖి తలపడ్డాడు. కానీ అతడి హత్యాకాండలు మాత్రం 2005లో ప్రారంభమయ్యాయి.

  • 2005, బిహార్ ముంగేర్ జిల్లా: మందుపాతర దాడిలో అప్పటి SP సురేంద్ర బాబు (ఆంధ్రప్రదేశ్‌కి చెందిన IPS అధికారి)తో పాటు నలుగురు పోలీసులు మరణించారు.
  • 2005, గిరిడి జిల్లా భెల్వాఘటి గ్రామం: 16 మంది గ్రామస్తులను సామూహికంగా హతమార్చాడు.
  • 2007, చిక్కారి గ్రామం: మాజీ సీఎం బాబులాల్ మరాండీ కుమారుడితో సహా 20 మందిని నిలబెట్టి కాల్చి చంపాడు.

2012లో గిరిడి జైలుపై మావోయిస్టులు దాడి చేసి సహదేవ్​ను తప్పించారు. అప్పటి నుంచి అతను బిహార్-జార్ఖండ్ సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలను కొనసాగించాడు. పరశ్​నాథ్​ కొండలు, సరండా అడవుల్లో అతడికి బలమైన పట్టుంది. అతనికి భద్రతగా ఎప్పుడూ 25–30 మంది గన్‌మెన్ల రక్షణ వలయం ఉండేది.

భద్రతా బలగాల నిరంతర ఆపరేషన్ల ఫలితంగా అతడు చివరికి CoBRA కమాండోలు, స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో మరణించాడు. ఈ ఏడాది ఇప్పటికే ఏడుగురు మావోయిస్టులు అగ్రనేతలు హతం కాగా, ఒకరు లొంగిపోయారు. మరో అగ్రనేత యువ మావోయిస్ట్​ కమాండర్​ హిడ్మా అనేకసార్లు పోలీసుల దాడినుండి తృటిలో తప్పించుకున్నాడు.  ఆపరేషన్​ కగార్​, ఆపరేషన్​ బ్లాక్​ ఫారెస్ట్​లతో మావోయిస్టు ఉద్యమం ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది. అమిత్​ షా అన్నట్లుగానే 2026 మార్చికల్లా వామపక్ష తీవ్రవాదం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.