ఉత్తరప్రదేశ్ బీజేపీలో అంతర్గత సంక్షోభం ముదురుపాకాన పడుతున్నది. ఈ నేపథ్యంలో యూపీ పార్టీ కార్యకర్తలతో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతారని తెలుస్తున్నది.
లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీలో అంతర్గత సంక్షోభం ముదురుపాకాన పడుతున్నది. ఈ నేపథ్యంలో యూపీ పార్టీ కార్యకర్తలతో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతారని తెలుస్తున్నది. యూపీ పార్టీలో కుమ్ములాటలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి, అమిత్షా మధ్య సుదీర్ఘ సమావేశం నేపథ్యంలో మోదీ సమావేశం గురించి చర్చలు ముందుకు వచ్చాయి.
యూపీలో ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గాయి. అందుకు మోదీ, షా శిబిరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పైనే నెపం నెట్టేస్తున్నది. అదే పేరుతో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు బలంగానే ఉన్నాయి. అయితే.. ఈ విషయంలో పార్టీ కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇంటిపోరు నేపథ్యంలో యూపీ బీజేపీ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉన్నది. ఆరెస్సెస్ నుంచి బలమైన మద్దతు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ కొనసాగుతారని ఆయన అనుకూల వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి మోదీ, షా నాయకత్వానికి యోగి ఆదిత్యనాథ్ రూపంలో పెను సవాలు పొంచి ఉన్నది. ఆదిత్యనాథ్కు ప్రధాని అయ్యే అవకాశాలు ఉండటంతో ఆయన ప్రాభవాన్ని తగ్గించేందుకు వ్యతిరేక వర్గం పావులు కదుపుతున్నదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆదిత్యనాథ్ సైతం రాష్ట్ర పార్టీలో గట్టి పట్టును సాధించి ఉన్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ప్రభుత్వంపై తన పట్టును చాటుకుంటూ.. ఉప ఎన్నికలు జరిగే వివిధ నియోజకవర్గాలకు ఇన్చార్జ్లుగా పలువురు మంత్రులను నియమించిన యోగి ఆదిత్యనాథ్.. తన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్లను మాత్రం బాధ్యతల్లో పెట్టలేదు. వీరిద్దరూ మోదీ, షా శిబిరమనే ప్రచారం ఉన్నది.
ఓబీసీ వర్గానికి చెంఇన మౌర్య.. అనేక సందర్భాల్లో బహిరంగంగానే ఆదిత్యనాథ్పై విమర్శలు చేశారు. ప్రస్తతం ఆయన ఢిల్లీలో మకాం వేశారు. ఆదిత్యనాథ్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు అధిష్ఠానంతో మంతనాలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు జూలై 14న లక్నోకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన యోగి ఆదిత్యనాథ్.. ఆయనతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.
వాస్తవానికి పార్టీపై, పార్టీ విభాగాలపై మౌర్యకు పెద్దగా పట్టులేదని చెబుతారు. అది ఆయన బలహీనతగా మారిందని రాజకీయ పరిశీలకులు చెబుతుంటారు. దీని వల్లే ముఖ్యమంత్రి మార్పు విషయంలో అధిష్ఠానం పెద్దగా దృష్టిసారించడం లేదని వారి అభిప్రాయం. అయితే.. మౌర్యకు రాష్ట్ర బీజేపీ సారథ్య పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నదని పలువురు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
యూపీలో సమాజ్వాది పార్టీ ప్రభావం పెరుగుతున్నది. దీన్ని అడ్డుకునేందుకు ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరిని మార్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చలు నడుస్తున్నాయి. ఆయన స్థానంలో ఓబీసీ నాయకుడిని తీసుకువస్తారని తెలుస్తున్నది.
ఒకవైపు బీజేపీ హిందూత్వ విధానాలు అనుసరిస్తుంటే.. పీడీయే కమ్యూనిటీలైన పిచడా (వెనుకబడిన తరగతులు), దళితులు, అల్ప సంఖ్యాక్ (మైనార్టీ)లపై సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ గట్టిగా దృష్టి సారించారు. వారిని తన పార్టీ ప్రభావంలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కృషి కొంత ఫలించడం వల్లే యూపీలో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ నేపథ్యంలో హిందూత్వ విధానాలు కొనసాగిస్తూనే ఓబీసీ అనుకూల వ్యూహాలు కూడా అనుసరించాలనే అభిప్రాయం బీజేపీ యూపీ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఈ కోణంలో చూస్తే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పీఠానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే.. పార్టీలో మాత్రం సంస్థాగతంగా భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
బీజేపీలో అంతర్గత సంక్షోభం నేపథ్యంలో సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.. అసంతృప్త బీజేపీ నేత కేశవ్ ప్రసాద్ మౌర్యకు ‘వానాకాలం ఆఫర్’ ఇచ్చారు. అధికార పార్టీలో ఎమ్మెల్యేలు 100 మంది వస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. ‘వందమందిని తీసుకురండి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి’ అని అఖిలేశ్.. ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ పోస్టులో ఆయన ఎవరినీ ఉద్దేశించనప్పటికీ.. యోగి ఆదిత్యనాథ్పట్ల అసంతృప్తితో ఉన్నవారిని ఉద్దశించిందేనని ఎస్పీ నేత ఒకరు చెప్పారు. ‘2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 111 సీట్లు గెల్చుకున్నది. మరో 100 మంది మద్దతు ఇస్తే సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు.