Modi vs Trump : అమెరికా సుంకాల రెట్టింపుపై ప్రధాని మోదీ స్పందన
అమెరికా 50% టారిఫ్లు విధించినా... రైతుల హక్కుల విషయంలో ఏమాత్రం రాజీ పడమని ప్రధాని మోదీ గట్టి హామీ ఇచ్చారు.

Modi vs Trump | న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుందన్ననెపంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50శాతం సుంకాలను విధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా స్పందించారు. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదంటూ అమెరికాను ఉద్దేశిస్తూ గట్టిగా బదులిచ్చారు.దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మోదీ మాట్లాడుతూ అమెరికాతో వాణిజ్యం, టారిఫ్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం వ్యక్తిగతంగా ఎంత చెల్లించేందుకైనా నేను సిద్ధమే. భారత్ సిద్ధమే అన మోదీ వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమమే మాకు అత్యంత ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీపడబోం. అలా చేయడం వల్ల మేం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాకు తెలుసు అని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. అమెరికా పెంచిన సుంకాలు ఈ నెల 27నుంచి అమలులోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాల పెంపుపే భారత్ అప్రమత్తమైంది. ఈ వియయమై చర్చించేందుకు రేపు కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతుంది. మరోవైపు ఈ నెల 25న అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం భారత్ కు రానుంది. భారత్ ప్రభుత్వంతో సుంకాల పెంపు పరిణామాలపై చర్చలు జరుగనున్నాయి. ఈ చర్చలు సఫలీకృతమైతే 27నుంచి సుంకాల పెంపు ఆగిపోవచ్చని భావిస్తున్నారు.
ట్రంప్ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుంందన్న కారణంలో ఇప్పటికే ఉన్న 25శాతం సుంకాలను 50శాతంకు పెంచి భారత్ కు షాక్ ఇచ్చారు. పెరిగే సుంకాలతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. ముఖ్యంగా రొయ్యలు, జంతు సంబంధ ఉత్పత్తులపై అదనపు భారం పడనుంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని అమెరికా చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. ఇందుకు అంగీకరిస్తే దేశంలోని రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఆందోళన ఉంది. అందుకే వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం మినహాయింపునకు భారత్ నిరాకరిస్తూ వచ్చింది. ఇది కూడా ట్రంప్ సుంకాల పెంపుకు కారణమని తెలుస్తుంది. 50శాతం సుంకాల పెంపు కాకుండా మరిన్ని సుంకాల పెంపు కూడా ఉంటుందని ట్రంప్ ప్రకటించడం మరింత ఆందోళనకరంగా మారింది.