కేరళం సీఎంగా వీడీ సతీశన్…కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన
కేరళం రాష్ట్ర సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ. సతీశన్ పేరును ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ గురువారం కేరళం సీఎంగా వీడీ సతీశన్ పేరును అధికారికంగా ప్రకటించారు.
విధాత :కేరళం రాష్ట్ర సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ. సతీశన్ పేరును ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ గురువారం కేరళం సీఎంగా వీడీ సతీశన్ పేరును అధికారికంగా ప్రకటించారు. సీఎం పదవి కోసం వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెనితల తీవ్రంగా పోటీ పడ్డారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సీఎం అభ్యర్థి ఎంపికపై 11రోజుల పాటు లోతైన కసరత్తు చేసింది. నిన్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మధ్య తుది సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం నేడు సీఎం పేరును ప్రకటిస్తామని ఎంపీ జైరాం రమేష్ వెల్లడించారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం సీఎం అభ్యర్థిగా వీడీ సతీశన్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.
సతీశన్ నేపథ్యం
వడక్కేయిల్ దామోదరన్ సతీశన్ నెట్టూరు, ఎర్నాకులం జిల్లాలో మే 31, 1964న ఆయన జన్మించారు. పనంపిల్లి నగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. తేవరలోని సేక్రేడ్ హార్ట్ కళాశాలలో అండర్-గ్రాడ్యుయేషన్ చదివారు. రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుండి సోషల్ వర్క్లో (MSW) పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు . ఆ తర్వాత అతను కేరళ లా అకాడమీ లా కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ లాస్ (LLB), తిరువనంతపురంలోని ప్రభుత్వ లా కాలేజీ నుండి మాస్టర్ ఆఫ్ లాస్ (LLM) పూర్తి చేశారు. ఆర్. లక్ష్మీ ప్రియను సతీశన్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఉన్నిమాయ అనే కుమార్తె ఉంది.
రాజకీయాల్లోకి రాకముందు 10ఏళ్ల పాటు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. NSUI ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. సతీశన్ 1996లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సతీశన్ కమ్యూనిస్ట్ కోటగా ఉన్న పరాపూర్ నుండి కేరళ శాసనసభ ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి పి. రాజు చేతిలో ఓడిపోయారు. 2001లో మొదటిసారిగా పరావూర్ నియోజకవర్గం నుంచి కేరళ అసెంబ్లీకి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుండి వరుసగా ఆరుసార్లు (2001, 2006, 2011, 2016, 2021,2026) అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, రమేష్ చెన్నితాల స్థానంలో సతీశన్ ను కేరళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తూ అనేక పోరాటాలు చేస్తూ వచ్చిన సతీశన్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. పీఏసీ, అంచనాల కమిటీ చైర్మన్ గా పనిచేశారు. కేపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా, ఏఐసీసీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు.
2026 కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి చారిత్రాత్మక విజయం సాధించి, 102 స్థానాలతో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. యూడీఎఫ్ (UDF) కూటమి 102 సీట్లు, తాజా మాజీ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ (LDF) కూటమి 35 సీట్లు, బీజేపీ 3 సీట్లు గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలతో కేరళంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సాంప్రదాయం మళ్లీ పునరావృతమైంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram