మోదీ షాక్…పెట్రోల్..డీజిల్, సీఎన్జీ ధరల పెంపు
ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిశాక పెట్రోల్, డీజిల్, సీఎన్జీల ధరలను కేంద్రం పెంచవచ్చన్న జనం ఆందోళనలను ప్రధాని మోదీ ప్రభుత్వం నిజం చేసింది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలను పెంచుతూ జనానికి మోదీ సర్కార్ షాక్ ఇచ్చింది.
విధాత : ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిశాక పెట్రోల్, డీజిల్, సీఎన్జీల ధరలను కేంద్రం పెంచవచ్చన్న జనం ఆందోళనలను ప్రధాని మోదీ ప్రభుత్వం నిజం చేసింది. పశ్చిమాసియా యుద్దంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర 110డాలర్లకు పైగా పెరిగిపోవడంతో దేశీయంగా నష్టాలు ఎదుర్కొంటున్న అయిల్ కంపెనీలు ఇంధన ధరలను పెంచుతు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు 3.04పైసలు, సీఎన్జీపై రూ.2 పెంచుతూ అయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దేశ వ్యాప్తంగా పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం నుంచే అమలులోకి వచ్చాయి.పెరిగిన ధరల మేరకు తెలంగాణ, ఏపీలలో పెట్రోల్ రూ.3.29, డీజిల్ 3.14పైసలు పెరిగింది.
ఓ వైపు పొదుపు మంత్రం..మరోవైపు ధరల బాదుడు
ఇంధన ధరల పెంపుతో ఇతర అనుబంధ వస్తువులు ధరలు కూడా పెరిగి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడటం ఖాయంగా కనిపిస్తుంది. పశ్చిమాసియా యుద్దం ఎఫెక్ట్ తో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభ నివారణకు ఇప్పటికే ప్రధాని మోదీ ఇంధన పొదుపు, ఏడాది పాటు బంగారం కొనుగోలు నిలిపివేయాలని ప్రజలకు సూచించారు. విదేశీ మారక నిల్వల పరిరక్షణకు, డాలర్ తో పోల్చితే రూపాయి విలువ పడిపోకుండా చూసేందుకు ఈ చర్యలు అవసరం అని పేర్కొన్నారు. ఇదే క్రమంలో ముందుగా బంగారంపై దిగుమతి సుంకాలు పెంచిన కేంద్రం గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిర్ణయం తీసుకుంది. మునుముందు ఇంకా ఎన్ని రకాల ధరల పెంపులు ఎదురవుతాయోనన్న ఆందోళన ప్రజల్లో వినిపిస్తుంది.
పశ్చిమాసియా సంక్షోభంతో ఎదురవుతున్న ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు మోదీ సర్కార్ ఓ వైపు పొదుపు మంత్రం, మరోవైపు ధరల పెంపు చర్యలతో అనుసరిస్తున్న ద్విముఖ వ్యూహంతో సాధారణ జనానికి తిప్పలు తప్పవని వాపోతున్నారు.
మోదీపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఫైర్
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా స్పందించింది.
ప్రధాని మోదీని ‘Inflation Man(ద్రవ్యోల్బణ వీరుడు)’ అంటూ విమర్శించింది. మోదీ మరోసారి ప్రజలపై కొరడా ఝుళిపించారంటూ విమర్శలు గుప్పించింది. ఎన్నికలు ముగిశాయి.. మోదీ వసూళ్లు మొదలయ్యాయి అంటూ ఎద్దేవా చేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram