సిసోడియాకు మళ్లీ చుక్కెదురు

ఎక్సైజ్ పాలసీ స్కామ్లో బెయిల్
పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఫిబ్రవరి 26 నుంచి జైలులోనే ఆప్ నేత
విధాత: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురైంది. ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో తన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ ‘స్కామ్’లో ఫిబ్రవరి 26న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసినప్పటి నుంచి సిసోడియా కస్టడీలోనే ఉన్నారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సోమవారం బెయిల్ పిటిషన్పై విచారణ జరిపింది. ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఈ కేసు విచారణ ప్రక్రియను ముగించాలని ఆదేశించింది. విచారణ నెమ్మదిగా సాగితే, తదుపరి దశలో సిసోడియా బెయిల్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
సీబీఐ అరెస్టు చేసిన తరువాత, సిసోడియాను తీహార్ జైలులో విచారించారు. తరువాత సీబీఐ ఆధ్వర్యంలోని ఎఫ్ఐఆర్ నుంచి వచ్చిన మనీలాండరింగ్ కేసులో ఈడీ సిసోడియాను తమ కస్టడీలోకి తీసుకున్నది.
ఆప్ నేతపై అభియోగాలు ‘చాలా తీవ్రమైనవి’ అని పేర్కొంటూ, ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించిన మనీ-లాండరింగ్ కేసులో హైకోర్టు బెయిల్ను గతంలో తిరస్కరించింది.
ఉపముఖ్యమంత్రిగా, ఎక్సైజ్ మంత్రిగా ఉన్నందున, సాక్షులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న ‘అత్యున్నత’ వ్యక్తి అని పేర్కొంటూ, మే 30న అతని బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.