Palitana | ప్రతి గ్రామం, పట్టణంలో శాఖాహారులు, మాంసాహారులు ఉంటారు. కానీ కొన్ని కుటుంబాలు కేవలం శాఖాహారం మాత్రమే తీసుంటారు. కానీ ఆ నగరంలో మాత్రం అన్ని కుటుంబాలు శాఖాహార కుటుంబాలే. అంతే కాదు.. నగరంలోని హోటల్స్లో కూడా మాంసాహారాన్ని నిషేధించారు.
Palitana | ప్రతి గ్రామం, పట్టణంలో శాఖాహారులు, మాంసాహారులు ఉంటారు. కానీ కొన్ని కుటుంబాలు కేవలం శాఖాహారం మాత్రమే తీసుంటారు. కానీ ఆ నగరంలో మాత్రం అన్ని కుటుంబాలు శాఖాహార కుటుంబాలే. అంతే కాదు.. నగరంలోని హోటల్స్లో కూడా మాంసాహారాన్ని నిషేధించారు. మరి నగరానికి నగరమే శాఖాహారంగా మారిందంటే ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఆ నగరానికి ఎంతో ప్రత్యేకత ఉంటే గానీ.. మాంసాహారంపై నిషేధం విధించడం సాధ్యపడదు. మరి ప్రపంచలోనే తొలి శాఖాహారంగా నిలిచిన ఆ నగరం ఎక్కడుంది..? ఆ నగరం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
గుజరాత్ భావ్నగర్ జిల్లాలో పాలిటానా ఉంది. ఈ ప్రాంతం జైనులకు గౌరవప్రదమైన గమ్యస్థానం. శత్రుంజయ కొండల చుట్టూ ఉన్న ఈ నగరానికి జైన్ టెంపుల్ టౌన్ అని కూడా పేరుంది. పాలిటానాలో మొత్తం 823 జైనుల ఆలయాలు ఉన్నాయి. 24 తీర్థంకరులకు లేదా జైన మతంలోని పవిత్ర సాధువులకు అంకితం చేయబడిన ప్రధాన పుణ్యక్షేత్రంగా పాలిటానా ప్రసిద్ధి చెందింది.
ఇక జైనులు కఠిన ఆహార నియమాలు పాటిస్తుంటారు. మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు. అయితే 2014 వరకు పాలిటానాలో మాంసంతో పాటు కోడిగుడ్లను విక్రయించేవారు. నగరంలో నాన్ వెజ్ రెస్టారెంట్లు కూడా బాగానే ఉండేవి. అయితే జైనులకు అతిపెద్ద తీర్థయాత్ర కేంద్రంగా గుర్తింపు పొందిన పాలిటానాలో గుడ్లు, మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. 2014 జూన్లో 200 మంది జైనులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష నాలుగు రోజుల పాటు కొనసాగింది.
జైనుల దీక్షను గమనించిన గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014, ఆగస్టు 14న పాలిటానాను మీట్ ఫ్రీ జోన్గా ప్రకటించారు. మాంసం, గుడ్లు, జంతు వధపై పూర్తిగా నిషేధం విధించారు. చేపల వేటకు కూడా అనుమతి లేదు. దీంతో పాలిటానా ప్రపంచంలోనే తొలి శాఖాహార నగరంగా అవతరించింది. అయితే, పాల ఉత్పత్తుల అమ్మకం లేదా వినియోగంపై నిషేధం లేదు. పదేండ్ల నుంచి పాలిటానా శాఖాహార నగరంగా కొనసాగుతోంది.