సీఎంల నీతి ఆయోగ్ సమావేశాన్ని ప్రతిపక్ష పార్టీల సీఎంలు బహిష్కరించడం సరికాదని, ఏవైనా విభేదాలు ఉంటే.. తన అభిప్రాయాన్ని నీతి అయోగ్ సమావేశానికి హాజరై తెలపాలని కేంద్ర మంత్రి పహ్లాద్ జోషి సూచించారు
విధాత, హైదరాబాద్ : సీఎంల నీతి ఆయోగ్ సమావేశాన్ని ప్రతిపక్ష పార్టీల సీఎంలు బహిష్కరించడం సరికాదని, ఏవైనా విభేదాలు ఉంటే.. తన అభిప్రాయాన్ని నీతి అయోగ్ సమావేశానికి హాజరై తెలపాలని కేంద్ర మంత్రి పహ్లాద్ జోషి సూచించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. మమతా బెనర్జి సహా విపక్ష పార్టీల సీఎంలు నీతి అయోగ్ ను బహిష్కరించి, ఆ సమావేశాన్ని రాజకీయ వేదికగా మార్చుకునే ప్రయత్నం చేయడం ఖండిస్తున్నామన్నారు. దేశాభివృద్ధిలో నీతి అయోగ్ కీలకమైందని, అటువంటి సమావేశంలో సీఎంలు పాల్గొని తమ అభిప్రాయలు వినిపించాలన్నారు. కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం వికసిత్ భారత్ దిశగా అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. పేదల సాధికారత కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, ఈ బడ్జెట్లో పేదల అభ్యుదయానికి పెద్దపేట వేశామని తెలిపారు. రైతుల పంటకు కనీస మద్దతు ధర కల్పించే దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార భద్రత స్కీం ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్ యోజన, ఉత్పాదకత, వ్యవసాయం, యువతకు ఉపాధి వంటి ప్రధాన అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చాం. గతంలో తెలంగాణలో బీఆరెస్ ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేయలేదని, ఈ ఏడాది 5 వేల కోట్ల రూపాయలకు పైగా రైల్వే బడ్జెట్ తెలంగాణకు కేటాయించామన్నారు. 48 వేల కోట్ల రూపాయల రోడ్డు ప్రాజెక్టులు తెలంగాణాలో చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయిస్తే మరిన్ని రోడ్లు విస్తరణ చేస్తామని, రామగుండం ఎరువుల కర్మాగారం తిరిగి ఓపెన్ చేశామన్నారు. గతంలో బీఆరెస్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన లెక్కలపై తప్పుడు లెక్కలు చెబితే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించిన సంగతి మరవరాదన్నారు.