Mango Juice | ఎండలు మండిపోతున్నాయి. మూగ జీవాలు విలవిలలాడిపోతున్నాయి. మూగ జీవాలకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఓ సేవా సంస్థ ముందుకు వచ్చింది.
Mango Juice | ఎండలు మండిపోతున్నాయి. మూగ జీవాలు విలవిలలాడిపోతున్నాయి. మూగ జీవాలకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఓ సేవా సంస్థ ముందుకు వచ్చింది. 2 వేల ఆవులకు నాణ్యతతో కూడిన మామిడి పండ్ల రసాన్ని అందించి గొప్ప మనసు చాటుకున్నారు ఆ సేవా సంస్థ వ్యవస్థాపకుడు.
గుజరాత్లోని వడోదరకు చెందికు నీరవ్ థక్కర్.. శ్రవణ్ సేవా ఫౌండేషన్ అనే ఎన్జీవోను నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు వేడి వేడి ఆహారాన్ని అందిస్తూ, వారి ఆకలి తీర్చుతున్నాడు. అయితే ఈ ఏడాది ఎండలు మండిపోతుండటం కారణంగా, మూగ జీవాలకు కూడా తన వంతు సహాయం చేయాలనుకున్నాడు.
ఈ క్రమంలో కర్జన్ పంజ్రాపోల్లోని ఆవుల షెడ్డుకు వెళ్లాడు. అక్కడున్న 2 వేల ఆవులకు నాణ్యమైన మామిడి పండ్ల రసాన్ని అందించేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం ఓ 500 కిలోల మామిడి పండ్లను కొనుగోలు చేశాడు. ఆ పండ్ల నుంచి రసాన్ని తయారు చేసి.. కర్జన్ పంజ్రాపోల్కు తరలించాడు.
ఇక అక్కడున్న ఓ పెద్ద సంపులో మామిడి పండ్ల రసాన్ని పోయగా, దాన్ని సేవించేందుకు ఆవులు పరుగెత్తుకు వచ్చాయి. ఇక చిక్కటి మామిడి పండ్ల రసాన్ని ఆవులు తాగి హాయిగా సేదతీరాయి. అప్పుడు ఆవుల ఆనందాన్ని చూసి చాలా సంతోషం వేసిందని నీరవ్ థక్కర్ పేర్కొన్నారు. మూగ జీవాల పట్ల ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్న నీరవ్పై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.