విధాత : తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కొనసాగుతున్న అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. టీవీకే అధినేత విజయ్ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3.15 గంటలకు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయ్ తో పాటు 9మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రుల జాబితాను కూడా గవర్నర్ కు విజయ్ అందించినట్లుగా సమాచారం.
శనివారం రాత్రి గవర్నర్ అర్లేకర్ ను కలిసిన విజయ్ తనకు మద్దతునిస్తున్న పార్టీల ఎమ్మెల్యేల వివరాలను సమర్పించారు. టీవీకేకు మద్దతుగా వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు ఇచ్చిన లేఖలను గవర్నర్ కు అందించారు. లోక్ భవన్ లో గంటకు పైగా గవర్నర్ తో విజయ్ సమావేశం అయ్యారు. అసెంబ్లీలో బలనిరూపణకు సంబంధించి తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు వివరించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ టీవీకే అధినేత విజయ్ కి అనుమతినివ్వడంతో విజయ్ ఫ్యాన్స్, టీవీకే శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మొదలుపెట్టారు.
120కి చేరిన విజయ్ సంఖ్యాబలం
ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ కి టీవీకే (107), కాంగ్రెస్ (5), సీపీఎం(2), సీపీఐ(2), వీసీకే(2), ఐయూఎంఎల్ (2) తో కలిపి మెజార్టీ మార్క్ (118) దాటేసి 120కి చేరింది. సీఎంగా విజయ్, మంత్రులుగా ఆనంద్, సెంగొట్టియాన్, నిర్మల్ కుమార్, అరుణారాజ్, విజయ్ శరవణన్, ఆధవ అర్జున్, తమిళన్ పార్థీబన్, మహ్మద్ ఫర్వేజ్, కల్లానైలకు, సత్యభామ, కీర్తన, విజయలక్ష్మిలలో తొలి విడతగా తొమ్మిది మంది ప్రమాణ స్వీకారం చేయవచ్చని తెలుస్తుంది.
