భారత సరిహద్దులో 100 గ్రాముల హెరాయిన్ అనే డ్రగ్ను సీజ్ చేయడంతోపాటు ఇద్దరిని అరెస్టు చేశారు.
విధాత: భారత సరిహద్దులో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 100 గ్రాముల హెరాయిన్ అనే డ్రగ్ను సీజ్ చేయడంతోపాటు ఇద్దరిని అరెస్టు చేశాయి. పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు శనివారం తెలిపారు.
తమకు అందిన నిర్దిష్ట సమాచారం మేరకు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం అర్థరాత్రి గురుదాస్పూర్లోని డెరివాల్ కిరణ్ గ్రామంలోని ఓ ఇంటిపై దాడి చేసినట్టు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. సోదాల్లో 100 గ్రాముల హెరాయిన్, 13 రౌండ్ల బుల్లెట్లు, .32 బోర్ పిస్టల్ లభించినట్టు పేర్కొన్నారు.
అనంతరం ఉప్పల్ గ్రామంలోని ఒక ఇంటిపై రెండు బలగాల సంయుక్త బృందాలు మరోసారి దాడులు నిర్వహించాయి. ఈ సందర్భంగా వారు పంప్ యాక్షన్ గన్ (PAG-రకం)తోపాటు 10 రౌండ్లు, ఒక .32 బోర్ కాట్రిడ్జ్తో కూడిన పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు అధికార ప్రతినిధి వెల్లడించారు.
మరో సంఘటనలో, అమృత్సర్ జిల్లా మోడ్ గ్రామంలోని పొలంలో 519 గ్రాముల బరువున్న డ్రోన్, హెరాయిన్ ప్యాకెట్ను బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారని అధికారి తెలిపారు. నిర్దిష్ట సమాచారం ఆధారంగా శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్టు పేర్కొన్నారు.