Medchal: మేడ్చల్ కలెక్టరేట్కు బాంబు బెదిరింపు

విధాత: మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కరీంనగర్ కు చెందిన మాజీ మావోయిస్టు నేత లక్ష్మణ్ రావు పేరుతో కలెక్టర్ ఈ మెయిల్ కు బాంబు బెదిరింపు వచ్చింది. అందులో చివరగా అల్లాహు అక్బర్ అనే నినాదం ఉంది. మధ్యాహ్నం 3:30 గంటలకు కలెక్టరేట్ ను బాంబులు పెట్టి లేపేయడంతో పాటు కలెక్టర్ ను కూడా చంపేస్తామని మెయిల్ లో మెన్షన్ చేసినట్టు సమాచారం. బాంబు బెదిరింపు వ్యవహారంపై విచారణ చేయాలని కలెక్టర్ గౌతం డీసీసీ కోటిరెడ్డికి ఆదేశాలిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. పోలీసుల హడావుడి..బాంబు బెదిరింపు సమాచారంతో సిబ్బంది, సందర్శకులు ఉరుకులు పరుగులు పెట్టారు. కలెక్టరేట్ లోని అన్ని శాఖల అధికారులను, ఉద్యోగులను బయటకు పంపించి డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు సాగించారు. చివరకు ఎలాంటి బాంబు లేదని తేలడంతో ఇది ఎవరో కావాలని చేసినట్లు అనుమానిస్తున్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ సెక్రటేరియట్ కు కూడా బాంబు బెదిరింపు ఫేక్ కాల్ రావడం గమనార్హం