Warangal | యజమాని పేరుతో గుమస్తాకు టోకరా.. రూ.కోటి 68 లక్షలు కొట్టేసిన సైబర్ నేరస్థుడు అరెస్ట్

విధాత, వరంగల్ ప్రతినిధి: యజమాని పేరుతో మేసేజ్ చేసి కోట్లు కొట్టెసిన సైబర్ నేరస్థుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కు చెందిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుడి నుండి పోలీసులు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబందించి వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ డి.ఎస్సీ సి.హెచ్. ఆర్.వి. ఫణీందర్ వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రతాప్ ఘడ్ జిల్లాకు చెందిన నిందితుడు ప్రదీప్ కుమార్ (39) హన్మకొండ పట్టణంలోని ప్రముఖ హచరీస్ సంస్థలో పనిచేస్తున్న గుమాస్తాకు గత నెల 19వ తేదిన ఒక గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుండి నేను మీ యజమానిని ఇది నా కొత్త ఫోన్ నంబర్ అని ఈ నంబర్ సేవ్ చేసుకోమ్మని వాట్సప్ మేసేజ్ పంపిచాడు.
తన యజమాని నంబర్ అని భ్రమపడిన గుమాస్తా తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. మరుసటి రోజున గుమాస్తా తాను సేవ్ చేసుకున్న నంబర్కు ఫోన్ చేయగా నేను మీటింగ్లో వున్నాను తరువాత చేస్తాను అని సైబర్ నేరగాడు సమాధానం ఇచ్చాడు. మరుసటి రోజున గుమాస్తా సేవ్ చేసుకున్న నంబర్ నుండి నిందితుడు చేయడంతో తన యజమాని ఫోన్ చేస్తున్నాడు అనుకొని ఫోన్ లిఫ్ట్ చేయడంతో, ఎక్కడ వున్నావు అని అడిగి తన బ్యాంక్ లావాదేవీలను తదితర వివరాలను అడిగి తెలుసుకోన్నాడు. ప్రస్తుతం వున్న బ్యాంక్ బ్యాలెన్స్ నుండి తను చెప్పిన ఆకౌంట్కు డబ్బును ట్రాన్స్ఫర్ చేయమనడంతో ఫోన్లో మాట్లాడేది తన యజమానిగా భావించిన గుమాస్త నిందితుడు చెప్పిన బ్యాంక్ అకౌంట్కు రెండు దఫాలుగా మొత్తం ఒక కోటి 68లక్షల రూపాయలను బదిలీ చేశాడు.
మరోమారు నిందితుడు ఫోన్ చేయడంతో నిందితుడి మాటతీరు పై అనుమానంతో తన యజమానికి సంబంధించిన వ్యక్తిగత నంబరు ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో కంగుతిన్న యజమాని, గుమాస్తా తాము సైబర్ నేరగాడి చేతి మోసపోయినట్లుగా గుర్తించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగంలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమ వద్ద వున్న టెక్నాలజీ వినియోగించుకోని సైబర్ నేరగాడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి పట్టుకోవడంలో శ్రమించిన సైబర్ క్రైమ్స్ ఇన్స్స్పెక్టర్ యాసిన్, ఎస్.ఐలు చరణ్, శివ, కానిస్టేబుళ్ళు శివ, జహూర్ ను డి.ఎస్పీ అభినందించారు.