Kaleshwaram HC Orders : కేసీఆర్, హరీశ్రావు లకు హైకోర్టులో చుక్కెదురు!
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్, హరీష్ రావు పిటిషన్పై తెలంగాణ HC స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసింది.

Kaleshwaram HC Orders | విధాత : కాళేశ్వరం కమిషన్ రిపోర్టు వ్యవహారంలో కేసీఆర్, హరీష్లకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయాలని వారు దాఖలు చేసిన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం అవసరం లేదని స్పష్టం చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ పీసీ.ఘోష్ కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఏజీ సుదర్శన్రెడ్డి హైకోర్టుకు అందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై అందిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని కోర్టుకు స్పష్టం చేశారు. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. నివేదికపై అసెంబ్లీలో చర్చించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కోర్టుకు ఏజీ వివరించారు.
వాదనల సందర్భంగా హరీష్ రావు తరఫు న్యాయవాది అర్యమా సుందరం తన వాదనలు వినిపిస్తూ.. మొత్తం కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ నివేదికను అడ్డం పెట్టుకుని తమ పిటిషనర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో తమ వారిపై ఎలాంటి చర్యలు తీసుకో వద్దని కోరుతున్నామని కోర్టు దృష్టికి న్యాయవాది సుందరం తీసుకు వెళ్లారు. అంతేకాకుండా.. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను అసెంబ్లీలో కంటే.. ముందే మీడియాకు ఇచ్చి.. తమ పిటిషనర్ల పరువుకు భంగం కలిగించారని కోర్టుకు న్యాయవాది సుందరం తెలిపారు. తమకు 8బీ, 8సీ కింద నోటీసు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ లు జోక్యం చేసుకుని.. 8బీ నోటీస్ కాకుండా సెక్షన్ 5(1) ఎందుకు ఇచ్చారంటూ ప్రభుత్వ తరఫు నాయ్యవాది ఏజీని సూటిగా ప్రశ్నించారు. తాము ఇచ్చిన నోటీస్ 8బీ లాంటి నోటీసు అని కోర్టుకు ఏజీ తెలిపారు. హరీష్ రావు, కేసీఆర్ అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారని ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఈ నివేదిక పెట్టిన తర్వాతే చర్యలు తీసుకుంటామన్న ఏజీ వెల్లడించారు. ఆ క్రమంలో ఈ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆరు నెలలు సమయం ఉంటుందని కోర్టుకు ఏజీ వివరించారు.
అయితే కమిషన్ నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పబ్లిక్ డొమైన్ నుంచి 60 పేజీల రిపోర్ట్ ను తొలగించాలని ఆదేశించింది. 8బీ, 8సీ నోటీసులు లేకుండా ఆరోపణలు చట్ట విరుద్ధం అని పేర్కొంది. దీనిపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.