Japan: ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధులివ్వండి: జైకాతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు

విధాత: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు రెండో దశ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించే రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా)ని కోరారు. జపాన్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఉన్నత యాజమాన్యంతో సమావేశమైంది. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులను సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం జైకాతో చర్చలు జరిపింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా, ఆ సంస్థ సీనియర్ మేనేజర్లతో భేటీ అయ్యారు.
పెట్టబడుల గమ్యస్థానం తెలంగాణ
పెట్టుబడిదారుల గమ్యస్థానంగా హైదరాబాద్ ను అత్యంత ఆకర్షణీయమైన నగరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి జైకా ప్రతినిధులకు వివరించారు. పెట్టుబడుల ఆకర్షణ దిశగా హైదరాబాద్ లో చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి తెలిచజేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ. 24,269 కోట్ల అంచనాలతో చేపట్టనున్న మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం తుది పరిశీలనలో ఉన్నాయని జైకా బృందానికి వివరించారు.
ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే వ్యయంలో 48 శాతం.. అంటే రూ.11,693 కోట్లు. రుణం అందించి మద్దతు ఇవ్వాలని కోరారు. భారత ప్రభుత్వ విదేశీ రుణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పాటిస్తుందని చెప్పారు. మెట్రో తో పాటు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు, కొత్త రేడియల్ రోడ్లకు నిధులు సమకూర్చాలని ముఖ్యమంత్రి జైకాను కోరారు. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యో లాంటి ప్రపంచ నగరాలతో సమానంగా అభివృద్ధి చేయాలనే తన ఆలోచనలను సీఎం రేవంత్ రెడ్డి జైకా ప్రతినిధులతో పంచుకున్నారు.
జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా మాట్లాడుతూ జైకాకు, తెలంగాణతో ఎన్నో ఏళ్లుగా సంబంధాలున్నాయని అన్నారు. మెట్రో రైలు విస్తరణతో పాటు, అర్హతలున్న ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, తెలంగాణకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.