హామీలపై కాంగ్రెస్ యూటర్న్
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై రెండు నెలల్లోపే యూటర్న్ మొదలైందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు

- ఎన్నికల్లో రుణ మాఫీ..ఇప్పుడు బలవంతపు వసూళ్లూ
- కేసీఆర్ ఉన్నప్పుడు రాని ఆదానీ ఇప్పుడెందుకు వస్తున్నారు..?
- కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
- మెదక్ పార్లమెంటరీ సన్నాహాక సమావేశంలో కీలక వ్యాఖ్యలు
విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై రెండు నెలల్లోపే యూటర్న్ మొదలైందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల్లో రైతులకు 2లక్షల రుణాలు తెచ్చుకోండని, అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పగా, అధికారంలోకి వచ్చాక ఆయన ప్రభుత్వంలోని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రుణాలు వసూలు చేయాలని, లేకుంటే కేసులు పెట్టయినా బలవంతపు వసూళ్లు చేయాలని ఆదేశించిన తీరు కాంగ్రెస్ ఎన్నికల హామీలపై యూటర్న్కు నిదర్శనమన్నారు. ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో చెబితే, భట్టి విక్రమార్క భృతి ఇస్తామని చెప్పలేదని హరీష్ రావు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామీ ఇచ్చారని, కానీ అది సాధ్యం కాదని మొన్న వారే చెప్పారన్నారు. రైతుబంధుపైనే అదే రీతిలో మాట తప్పారన్నారు. కాంగ్రెస్ నోటికి ఎంత వస్తే అంత అనుకుంటూ హామీలు ఇచ్చారని, అందుకే 420 హామీలను అమలు చేసేదాకా విడిచి పెట్టమన్నారు. ప్రధాని, అదానీ ఒక్కటని విమర్శలు చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని, రాహుల్ గాంధీ నిన్ననే అదానీని తిడితే, రేవంత్ రెడ్డి అదే సమయంలో దావోస్లో ఒప్పందం చేసుకున్నారని, ఈ వ్యవహారం కూడా కాంగ్రెస్ నేతల మాటలకు, చేతలకు పొంతన లేదన్న సంగతిని చాటుతుందన్నారు. ఆదానీపై నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు మధ్య ఉన్న అసలు రంగు బయట పడుతుందన్నారు.
కేసీఆర్ ఉన్నంత కాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదని, కానీ కాంగ్రెస్ రాగానే ఎలా అడుగు పెడుతున్నాడని కేటీఆర్ నిలదీశారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుళ్ళ అయ్యిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలం అయ్యిందని అబద్ధాలు మాట్లాడించారని, అందుకే స్వేద పత్రం విడుదల చేశామని, తెలంగాణ సమగ్ర అభివృద్ధిని గణాంకాలు, ఆధారాలతో సహా వివరించామన్నారు. ఇక హరీశ్ రావు నాయకత్వంలో గతంలో మెదక్ ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించామని, ఈ సారి కూడా మెదక్లో గులాబీ జెండా ఎగరబోతుందన్న ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్ళలో తెలంగాణ తరుపున గళం విప్పింది మన బీఆరెస్ ఎంపీలు అనే విషయం మరచి పోవద్దని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆరెస్ పార్టీ మాత్రమేనన్నారు. మన బలం, మన గళం, మన గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలని, లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని. ఇదే విషయం ప్రజలకు చెప్పాలన్నారు. నిరాశ నుంచి బయటికి రావాలి అని లోక్సభ ఎన్నికలకు కదనోత్సహంతో సాగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.