ప్రస్తుతం ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుండగా, ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా పట్టు బిగించింది. ఇంతవరకు దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవని టీమిండియా ఈ సారైన అద్భుతం చేస్తుంది అని అనుకుంటే కాస్త కష్టమే అనిపిస్తుంది.తొలి టెస్ట్లో టీమిండియా 208/8 ఓవర్నైట్ స్కోరుతో బుధవారం నాటి ఆటను ఆరంభించింది.ఈ తరుణంలో కేఎల్ రాహుల్ 101 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ప్రారంభంలో భారత్ 8.4 ఓవర్లు మాత్రమే ఆడి 245 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన సౌతాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ వికెట్ కోల్పోయింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిరాజ్ అతనిని ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన టోనీ డి జార్జి, డీన్ ఎల్గర్ మంచి భాగస్వామ్యం నమోదు చేశారు.
93 పరుగుల భాగస్వామ్యాన్ని బుమ్రా బ్రేక్ చేశారు. టోనీని 28 పరుగులకు.. ఆ తర్వాత అతడి స్థానంలో వచ్చిన కీగాన్ పీటర్సన్ 2 పరుగులకే వెనక్కి పంపాడు బుమ్రా. సౌతాఫ్రికా 9 పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ ఇద్దరూ సౌతాఫ్రికా బ్యాటర్లు ఔటవ్వకుముందు కోహ్లీ.. ఏదో మంత్రం వేయడం కెమెరాలలో రికార్డ్ అయింది. టోని డీ జోర్జీ ఔటయ్యే రెండు బాల్స్ ముందు కోహ్లీ వికెట్ బెయిల్స్ మార్చడంతో లక్ ఇండియా వైపు తిరిగింది. కోహ్లీ చేసిన ఈ చిలిపి వల్లనే వరుస వికెట్లు పడ్డాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన యాషెస్ సిరీస్లోనూ ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఇలానే ఓ మ్యాచ్లో స్టంప్స్ను మార్చి సక్సెస్ అయ్యాడని, ఆ మంత్రాన్నే కోహ్లీ ఉపయోగించాడని నెటిజన్లు గుర్తు చేసుకున్నారు.
అయితే వరుస వికెట్లు పడిన తర్వాత ఎల్గర్కు డేవిడ్ బెడింగ్హామ్ నుంచి మంచి సహకారం అందింది. ఎల్గర్.. 42.1 ఓవర్ వద్ద శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేశారు. ఇక 244 పరుగుల వద్ద డేవిడ్ (56) సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఇలా ఎల్గర్- డేవిడ్ బెడింగ్హామ్ల భారీ భాగస్వామ్యానికి తెరపడగా, కొద్ది సేపటికి వికెట్ కీపర్ కైల్ వెరీన్ (4) ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ సమయానికి సౌతాఫ్రికా 254 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన మార్కో జాన్సెస్, సెంచరీ వీరుడు ఎల్గర్ సైతం చాలా జాగ్రత్త ఆచితూచి ఆడాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 66వ ఓవర్ వద్ద వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు.ఆ సమయానికి సౌతాఫ్రికా పదకొండు పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో ఇంకా ఐదు వికెట్లు ఉన్నాయి. డీన్ ఎల్గర్ 140, జాన్సెన్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు.