రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకపోతే ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని అడుగడుగునా వెంటాడి,వేటాడుతామని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ హెచ్చరించారు
*గిరిజన శాఖకు మంత్రి ఎందుకు లేరు?
*ఇల్లు లేని గిరిజనులకు ఇంటి జాగాలు ఏవి?
*కరీంనగర్ లో బండి గెలుపు ఖాయం
విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకపోతే ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని అడుగడుగునా వెంటాడి,వేటాడుతామని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ఓట్లు దండుకుని మోసం చేసిందని మండిపడ్డారు.
సోమవారం హుస్నాబాద్ తిరుమల గార్డెన్ లో జరిగిన ఎస్టీ మోర్చా సమావేశంలో కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి గిరిజనులంటే చులకనగా ఉందని మండిపడ్డారు. ‘‘ గిరిజన శాఖకు మంత్రి ఎందుకు లేరు? ఎస్టీలకు చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయడం లేదు? ఇల్లులేని గిరిజనులకు ఇంటిజాగాతోపాటు రూ.6 లక్షలిస్తామని ఎందుకివ్వలేదు’’అని ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలతోపాటు గిరిజన సమస్యలపై అనేక పోరాటాలు చేసిన బండి సంజయ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత గిరిజనులందరిపైనా ఉందన్నారు. బండి సంజయ్ గెలిస్తే కేంద్ర మంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. బండి సంజయ్ కు జోగులాంబ, సమ్మక్క సారలక్క ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయన్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు గిరిజనుల పక్షాన బండి సంజయ్ చేసిన పోరాటాలను ప్రతి తండాకు వెళ్లి వివరిస్తామని చెప్పారు. బండి సంజయ్ ను 3 లక్షల మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు.