Revanth Reddy Meets High Court Chief Justice | హైకోర్టు చీఫ్ జస్టీస్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తో భేటీ.. కోర్టుల మౌలిక వసతులు, సిబ్బంది నియామకం చర్చ.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి భవనంలో భేటీ అయ్యారు. ఈ భేటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, లా సెక్రటరీ పాపి రెడ్డి, జస్టిస్ పి. సామ్ కోశి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు. కొత్త జిల్లాల్లో అవసరమైన చోట కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు సీజే అపరేష్ కుమార్ సింగ్ సూచించారు. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ప్రాధాన్యత వారీగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కొత్త జిల్లాలలో కోర్టులకు మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.