రాష్ట్రంలో బెల్ట్ షాపు ఒక్కటి కూడా లేదట!
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదట! మద్యం మొత్తం లైసెన్స్ ఉన్నదుకాణాల్లోనే అమ్ముతున్నారని తెలంగాణ ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది

- కానీ వేల మందిపై కేసులు నమోదు
- యూత్ ఫర్ యాంటీ కరప్షన్ దరఖాస్తుకు
- ఎక్సైజ్శాఖ అధికారుల సమాధానం
విధాత, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదట! మద్యం మొత్తం లైసెన్స్ ఉన్నదుకాణాల్లోనే అమ్ముతున్నారని తెలంగాణ ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. అయితే.. అక్రమంగా మద్యం విక్రయిస్తున్నందుకు నాలుగేళ్ల వ్యవధిలో 7413 మందిపై కేసులు నమోదు చేసినట్టు కూడా వెల్లడించింది. యాత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచార హక్కు కింద చేసిన దరఖాస్తుకు ఎక్సైజ్ శాఖ ఈ మేరకు సమాధానాలు ఇచ్చింది.
ఊరూరా బెల్ట్ షాపులే..
తెలంగాణ ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం మద్యం నుంచే వస్తున్నది. ప్రజల చేత మద్యం తాగించేందుకు ఈ శాఖ కూడా అంతే ప్రోత్సాహాన్ని ఇస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఊర్లో బెల్ట్షాప్లు విచ్చలవిడిగా ఉన్నాయని యాత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆరోపిస్తున్నది. ఆ బెల్టు షాపులు ఎక్కడున్నాయి? ఎవరు అమ్ముతున్నారు? అనే విషయాలు ఎక్సైజ్ అధికారులకు తెలిసినా తమకేమీ సంబంధం లేనట్టుగానే ఉంటున్నారని విమర్శించింది. మంచినీళ్లు దొరకని గ్రామాల్లో కూడా బెల్టుషాపులు ఉంటాయనేది ఎన్నో ఏళ్లుగా ఉన్న విమర్శ. అసలు తెలంగాణ పల్లెల్లో బెల్టుషాపులు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం ద్వారా ఎక్సైజ్ శాఖను ప్రశ్నించినట్టు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్రంలో బెల్టు షాపులు ఉన్నాయా, లేవా? ఒకవేళ బెల్టు షాపులు ఉంటే ఏయే జిల్లాలలో ఎన్ని షాపులు ఉన్నాయి?ఇప్పటివరకు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై ఎన్ని కేసులు పెట్టారు? ఎన్ని షాపులను సీజ్ చేశారు? అనే వివరాలు తెలియజేయాలంటూ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర తెలిపారు.
బెల్టుషాపుల్లేవట
సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు ప్రతి జిల్లా నుంచి ఆ జిల్లా ఎక్సైజ్ అధికారి సమాచారం పంపారని రాజేంద్ర తెలిపారు. పెద్దపల్లి, మహబూబ్ నగర్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సికింద్రాబాద్, నిర్మల్, మంచిర్యాల, వరంగల్ , బెల్లంపల్లి, ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల ఎక్సైజ్ అధికారులు తమ ప్రాంతంలో బెల్టు షాపులు లేవని తెలిపారని పేర్కొన్నారు. ఎక్కడైనా బెల్ట్ షాపులు ఉన్నాయని సమాచారం వస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని సమాచారం ఇచ్చారన్నారు.
వేలాది మందిపై కేసులు
రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవని చెప్పిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ.. కేసులు మాత్రం వేలల్లో నమోదు చేసినట్లు సమాచారం ఇచ్చింది. ఇంతమంది అక్రమంగా మద్యం అమ్ముతున్నారని తెలిసీ దాడులు చేసి కేసులు నమోదు చేసిందా? లేదా టార్గెట్ కోసం కేసులు నమోదు చేసిందో అర్థం కావడం లేదని రాజేంద్ర సందేహం వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం కింద ఎక్సైజ్ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం 2020లో 2,762, 2021లో 2,066, 2022లో 1,742, 2023లో జూలై 31వరకు 843 కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. మొత్తం ఈ నాలుగేళ్లలో 7,413 కేసులు రాష్ట్రంలో నమోదు చేసినట్లు ఎక్సైజ్ శాఖ సమాచారం ఇచ్చినట్లు సంస్థ పౌండర్ రాజేంద్ర తెలిపారు. ఇన్ని కేసులు ఎందుకు నమోదు చేశారో మాత్రం తెలుపలేదని అన్నారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో అక్రమ మద్యం కేసులు నమోదయ్యాయంటే బెల్ట్ షాప్లు అడ్డగోలుగా వెలిశాయన్న సందేహాలు బలపడుతున్నాయని చెప్పారు.