Telangana Assembly | నిండు అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను అవమానించారు…క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్
నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆరెస్ మహిళా ఎమ్మెల్యేలపై సభానాయకులు, సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలతో అవమానించారని,మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ట్విటర్ వేదికగా తీవ్రంగా ఖండించారు

విధాత, హైదరాబాద్ : నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆరెస్ మహిళా ఎమ్మెల్యేలపై సభానాయకులు, సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలతో అవమానించారని,మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ట్విటర్ వేదికగా తీవ్రంగా ఖండించారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమని, సీఎం వెంటనే బీఆరెస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆరెస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించామని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని చెప్పుకొచ్చారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయమన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే తప్పా.? రైతన్నల ఆత్మహత్యలు, నేతన్నల మరణాలు, ఆటో కార్మికుల బలవన్మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీడయడమే మేము చేసిన తప్పా.? అని పశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పట్ల అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తడమే మేము చేస్తున్న తప్పా.? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మందబలంతో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ దురహంకారాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని, కాంగ్రెస్ చేస్తున్న ఒక్కో తప్పును లెక్కబెడుతున్నరని హరీశ్రావు పేర్కొన్నారు.