HMWSSB | హైదరాబాద్ : ముందే మండుటెండలు.. నీటి కొరత తీవ్రంగా ఉంది.. ఈ క్రమంలో తాగునీటిని దుర్వినియోగం చేయొద్దని జలమండలి అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా నగర ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన వ్యక్తులకు కూడా భారీగా జరిమానా విధిస్తున్నారు. అయినా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.
తాజాగా ఓ వ్యక్తి జలమండలి నీటితో ఫర్నీచర్ స్టోర్ ఆవరణను శుభ్రపరిచారు. దీంతో జలమండలి తీవ్రంగా స్పందించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న ఆరెంజ్ ట్రీ ఫర్నీచర్ షాపునకు రూ. 10 వేల జరిమానా విధిస్తూ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి నోటీసులిచ్చారు.
ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.