విధాత ప్రతినిధి, హైదరాబాద్: జర్నలిస్టులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ వర్నింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టియుడబ్ల్యుజే), ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్క్లబ్ వద్ద నుంచి ట్యాంక్బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకూ నిరసన ర్యాలీ జరిగింది. ఢిల్లీలో న్యూస్ క్లిక్ కార్యాలయంపై, మరో 50 మంది జర్నలిస్టుల ఇళ్లలో పోలీసుల సోదాలు, న్యూస్ క్లిక్ ఎడిటర్ అరెస్టును జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు.
పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకొంటామని నినదించారు. జర్నలిస్టులపై దాడులు, నిర్బంధాలకు పాల్పడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులను ఉద్దేశించి పలువురు వక్తలు ప్రసంగించారు. జర్నలిస్టులపై, పత్రికా స్వేచ్ఛ విషయంలో జరుగుతున్న దాడులు, నిర్బంధాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. మోదీ ప్రభుత్వంలో స్వతంత్ర వార్తా సంస్థలు, జర్నలిస్టులపై అనేక నిర్బంధాలు, పోలీసు వేధింపులు పెరిగిపోతున్నాయని, జర్నలిస్టులందరూ కలిసికట్టుగా దీనికి ఎదుర్కొంటామన్నారు.
దేశవ్యాప్తంగా అనేకచోట్ల జర్నలిస్టులపై దాడులు, హత్యలు, నిర్బంధాలు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, దీన్నిబట్టి చూస్తే వీటి వెనుక వారి ప్రోద్బలం కూడా ఉందని అనుకోవాల్సి వస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషన్రెడ్డి, మరో మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్లు మాట్లాడుతూ, ఒక్క జర్నలిస్టుల విషయంలోనేకాదు, దళిత, గిరిజన ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కూడా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
పత్రికా స్వేచ్ఛకు ఆటంకం కలిగించిన దేశాలకు ఎలాంటి గతి పట్టిందో చరిత్రలో ఉందని, పాలకులు ఒక్కసారి దాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ మెసేజ్ ద్వారా జర్నలిస్టుల నిరసన ర్యాలీకి సంఘీభావం తెలిపారు. ఢిల్లీలో ఉండటం వల్ల జర్నలిస్టుల నిరసన ర్యాలీలో పాల్గొనలేకపోతున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఐజేయూ నాయకులు కే. శ్రీనివాస్రెడ్డి, ప్రసిద్ధ పాత్రికేయులు కే. రామచంద్రమూర్తి, కే. శ్రీనివాస్, కట్టా శేఖర్రెడ్డి, ఆర్వీ రామారావు, పాశం యాదగిరి, నవాద్ జాహిద్ అలీఖాన్, వసంతలక్ష్మి, దామెర్ల సాయిబాబా, ఎన్.వేణుగోపాల్, సి.వనజ, సజయ, ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, రమా మేల్కోటే, పద్మజా షా, పి.ఎల్. విశ్వేశ్వర్రావు, మానవ హక్కుల వేదిక జీవన్కుమార్, పిడబ్ల్యువో సంధ్య, విప్లవజ్యోతిలతోపాటు జర్నలిస్టులు రొద్దం శ్రీనివాస్, చందు తులసి, అరుణ, టియుడబ్ల్యుజే నాయకులు విరాహత్ అలీ, నరేందర్రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారులు పల్లె నరశింహ- బృందం పాడిన ”అచ్చేదిన్ కాదు…సచ్చే దిన్” పాట ఆకట్టుకుంది.