ఓటుకు నోటు కేసులో జూలై 14 రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ అని, ఈ విషయం తెలిసి కాంగ్రెస్ పార్టీ వాళ్లే పండగ చేసుకుంటున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు
బీజేపీ ఎంపీ ధర్మపురి కీలక వ్యాఖ్యలు
విధాత : ఓటుకు నోటు కేసులో జూలై 14 రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ అని, ఈ విషయం తెలిసి కాంగ్రెస్ పార్టీ వాళ్లే పండగ చేసుకుంటున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగాఆయన మాట్లాడుతూ బ్యాగులు మోసిన కేసు దగ్గర పడిందని, ఆ కేసులో జూలై 14 సీఎం రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ అని, ఈ వార్త విని జూలై 14 ఎప్పుడు వస్తుందని కాంగ్రెస్లోని సీఎం కుర్చీ ఆశావహులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి లాంటి వాళ్లు పండగ చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ప్రజలు నిలదీయకుండా, వారి దృష్టిని మళ్లించేందుకు రిజర్వేషన్ల రద్దు అంటు సీఎం రేవంత్రెడ్డి ఫేక్ వీడియోలతో దుష్ప్రచారానికి దిగారని మండిపడ్డారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను బీజేపీ కదిలించేది లేదని, వారి కోటాకు కోత పెట్టి ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తుందన్నారు. ఇప్పటికే ప్రదాని మోదీ బ్రతికున్నంత కాలం ఎవ్వరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ముట్టుకోరని స్పష్టం చేశారని గుర్తు చేశారు. సీఎం హోదాలో ఉండి గాడిద గుడ్డు అంటూ చిల్లర రాజకీయాలు చేయడం ఏంటని, కేంద్రం పదేళ్లలో తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాల్సింది పోయి 75 ఏండ్ల జీవన్ రెడ్డి కూడా గుడ్డు మోస్తారా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ 10 ఏండ్లు రాజకీయం చేసి కుండలు పెట్టి బిందెలు ఎత్తుకొని పోయాడని, రేవంత్ రెడ్డి కుండ లేదు బిందలేదంటున్నారని అర్వింద్ విమర్శించారు.