తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తాను రాష్ట్ర ప్రజలకు చేసిన సేవను గుర్తించి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవినిచ్చి గౌరవించి మాట నిలుపుకుందని కోదండరామ్ అన్నారు
విధాత : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ, తెలంగాణ జనసమితి నాయకుడిగానూ తాను రాష్ట్ర ప్రజలకు చేసిన సేవను గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవినిచ్చి గౌరవించి మాట నిలుపుకుందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. టీజేెస్ కార్యాలయంలో ఆయన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు.
ఎమ్మెల్సీగా ప్రభుత్వం తనను ఎంపిక చేసింది అంటే తెలంగాణ జన సమితి నాయకులు చేసిన సేవను గుర్తించడమేనన్నారు. పదవులు తమ సొంతానికి ఉపయోగించడానికి కాదని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా పని చేశామో అదేవిధంగా రేపు కూడా పని చేస్తామన్నారు. తెలంగాణలో అశించిన మార్పుల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
రాజ్యాంగం పనికి రాదని, కొత్త రాజ్యాంగం రాసుకోవాలని కేసీఆర్ వంటి వారు అన్నారని, అటువంటి వారు చైనా, సింగపూర్ లలో ఉన్న నియంతృత్వ పాలన కొనసాగాలని చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంతా రాజ్యాంగ విలువల ప్రకారం జరిగిందన్నారు. సమాజ మార్పు దానంతట అదే జరుగుతుందనుకుంటే జరగదన్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ చనిపోయే ముందు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు అచరణలోకి వస్తేనే పూర్తి సమానత్వం వచ్చినట్లు అన్నారని ఈ సందర్భంగా కోదండరామ్ గుర్తు చేశారు.