ప్రస్తుత లోకసభ ఎన్నికల్లో మనం కనీసం 10 సీట్లు గెలుచుకుంటే, ఏడాది లోపే కెసిఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు తెలిపారు
*కేంద్ర నిర్ణయాలను అడ్డుకునే శక్తి మనకే ఉంది
*శాసనసభ ఎన్నికల్లోమనల్ని మనమే ఓడించుకున్నాం
*బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
విధాత బ్యూరో, కరీంనగర్: ప్రస్తుత లోకసభ ఎన్నికల్లో మనం కనీసం 10 సీట్లు గెలుచుకుంటే, ఏడాది లోపే కెసిఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు తెలిపారు. ఆదివారం కరీంనగర్ లోకసభ పరిధిలోని వేములవాడ, మానకొండూరు, కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గ కేంద్రాలలో ఏర్పాటుచేసిన పార్టీ కార్యకర్తల సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. ఏడు పదుల వయసులో, తుంటి విరిగి అనారోగ్యంతో ఉన్నా, కూతురు జైలులో ఉన్నా, నమ్మిన వాళ్లే మోసం చేసి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నా కేసీఆర్ బస్సు యాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారని చెప్పారు. తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు, నేతల మధ్య పంచాయతీలు ఏవి ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్రం రాష్ట్ర అవసరాలను కాదని, నదుల అనుసంధానానికి ప్రయత్నించినా, దక్షణ భారతదేశానికి లోకసభ సీట్లలో అన్యాయం జరిగేలా చూసినా, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్రలు చేసినా, హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కానీ, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నించినా దానిని అడ్డుకొనే శక్తి బీఆర్ఎస్ కు మాత్రమే ఉందన్నారు.
2014,2019 లోకసభ ఎన్నికల్లో బడే భాయ్ దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానని, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఓట్లు దండుకుంటే, మొన్నటి శాసనసభ ఎన్నికల్లో చోటే భాయ్ తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో అన్ని చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి
ప్రజలను మోసగించారని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏ ప్రాంతానికి వెళ్లినా ఇదే పళ్లెంలో మన్ను పోసుకున్నామని ప్రజలు వాపోతున్నారని, పాలిచ్చే బర్రెను కాదని, దున్నపోతును తెచ్చుకున్నామని భావిస్తున్నారని తెలిపారు.
ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మాత్రం పెరిగాయన్నారు. పెట్రోలు, డీజిల్ పై వచ్చే సెస్ కూడా రాష్ట్రాలకు రాకుండా చేశారన్నారు. ఈ విధంగా పదేళ్ల పాలనలో బిజెపి ప్రజల ముక్కు పిండి 30 లక్షల కోట్లు వసూలు చేసిందన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఆ నిధులను జాతీయ రహదారుల నిర్మాణ పనులపై ఖర్చు చేశామని చెబుతున్నారని తెలిపారు.
అలాంటప్పుడు జాతీయ రహదారులపై టోల్ వసూలు చేయడం ఎందుకని ప్రశ్నించారు.
కరీంనగర్ లోకసభ స్థానంలో తమకు బీజేపీతోనే పోటీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ని ఆ పార్టీ కార్యకర్తలు కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదన్నారు. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తమను ఓడించలేదని, మనల్ని మనమే.. ఓడించుకున్నామని.. ఇక నేను అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. శాసనసభ ఎన్నికల నాటి తప్పులు పునరావృతం కారాదన్నారు.